ఇండియా తిరిగి వచ్చేసిన బుమ్రా.. : నేపాల్ మ్యాచ్ కు దూరం

ఇండియా తిరిగి వచ్చేసిన బుమ్రా.. : నేపాల్ మ్యాచ్ కు దూరం


ఆసియా కప్ లో భాగంగా టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వదేశానికి పయనమయ్యాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం అత్యవసర పని మీద బుమ్రా ముంబైకి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో నేడు నేపాల్ తో జరగబోయే మ్యాచ్ కి ఈ స్టార్ పేసర్ దూరం దూరం కానున్నాడు. బుమ్రా ప్లేస్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో స్థానం దక్కించుకోలేకపోయిన మహమ్మద్ షమీ నేటి మ్యాచ్ కి సిద్ధం కానున్నాడు.ఇదిలా ఉండగా.. బుమ్రా ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీ ఉంచుకొని స్వదేశానికి రావడంతో టీమిండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య:

వెన్నుగాయం నుంచి దాదాపు ఏడాది కాలం టీమిండియాకు దూరమైనా బుమ్రా..ఇటీవలే ఐర్లాండ్ తో టీ 20సిరీస్ లో భాగంగా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. అయితే  పాక్ తో జరిగిన మ్యాచులో వర్షం కారణంగా బూమ్రాకి బౌలింగ్ వేసే అవకాశం రాలేదు. దీంతో మరో సారి గాయం తిరగబెట్టిందని భావించారంతా. కానీ అసలు విషయం ఏమిటంటే బుమ్రా ఒక పండంటి మగబిడ్డకు తండ్రయ్యాడు. ఈ రోజు ఉదయం అతని భార్య సంజనా గణేశన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను బుమ్రా స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో వెల్లడించాడు. అంతేకాదు అప్పుడే తన కొడుకుకి అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రా అని పేరు కూడా పెట్టేసాడు. "ప్రస్తుతం మాకు చందమామపై ఉన్నట్లు ఉంది. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయంతో తెచ్చే ప్రతిదాని కోసం వేచి ఉండలేం" అంటూ ట్వీట్ చేసాడు. 

సూపర్ 4 సమయానికల్లా జట్టులోకి:

నేడు నేపాల్ తో మ్యాచ్ కి బుమ్రా దూరమైనా సూపర్ ఫోర్ మ్యాచులకి జట్టులోకి చేరనున్నాడు. అయితే అంతకంటే ముందు ఈ మ్యాచులో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తేనే సూపర్ ఫోర్ దశకు వెళ్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రూప్ లో భాగంగా టీమిండియా పాక్ తో ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటికే పాకిస్థాన్ నేపాల్ మీద విజయంతో 3 పాయింట్లతో సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. మరో స్థానం కోసం భారత్, నేపాల్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. పల్లె కెలె లో జరగనున్న ఈ మ్యాచులో మరోసారి వర్షం పడే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్ రెండు పాయింట్లతో సూపర్ 4 లోకి అడుగుపెడుతుంది.