జార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు

జార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబంధించి కఠిన నిబంధనలను విధించింది. ఇప్పటి వరకు వరుసగా ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. లేటెస్టుగా లాక్ డౌన్ రేపటి(జూన్-24) తో ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని జార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంతరాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈపాస్ ఉండాలని సూచించింది. అధికారుల వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం హేమంత్ సొరేన్ అధ్యక్షతన ఇవాళ(బుధవారం) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో  లాక్ డౌన్ కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.

ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు సీఎం హేమంత్ సొరేన్. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదని..కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్నారు.