- కేంద్రంపై కోపంతోనే పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ అమలు చేయలే
- బెంగాల్ రోడ్షోలో జేపీ నడ్డా
- నదియా జిల్లాలో రథయాత్రను స్టార్ట్ చేసిన బీజేపీ చీఫ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను రాష్ట్రంలో అమలు చేయకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైతులకు అన్యాయం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మమత మొండి వైఖరి, ఈగో కారణంగా రాష్ట్రంలో 70 లక్షల మంది ఈ స్కీంకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ తరువాత తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలు టాటా చెప్పబోతున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బెంగాల్లోని మాల్దాలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్తో కలిసి నడ్డా పాల్గొన్నారు. మాల్దాలోని ఫోరామోర్ నుంచి గురు రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం వరకు జరిగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రోడ్ షో చేస్తున్న వెహికల్పై పూల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని అమలు చేయాలని సుమారు 25 లక్షల మంది ప్రజలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. అందుకే, బెంగాల్లో ఆ పథకాన్ని అమలు చేయనున్నట్టు మమత ఇటీవల ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే సీఎం ఆ ప్రకటన చేశారని, కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మండిపడ్డారు. జై శ్రీరామ్ నినాదాలపై మమత అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. బీజేపీ చేపట్టనున్న ఐదు రథయాత్రలలో మొదటిదాన్ని 15వ శతాబ్దపు సెయింట్ చైతన్య మహాప్రభు బర్త్ప్లేస్ నదియా జిల్లా నవద్వీప్లో నడ్డా జెండా ఊపి ప్రారంభించారు. వామపక్షాల పాలన నుంచి మార్పు కోసం 2011లో మమత తీసుకున్న ‘మార్చ్ ఫర్ ఛేంజ్’ స్లోగన్నే ఇప్పుడు బీజేపీ తీసుకుంది.
For More News..