
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. పటాన్ చెరువు పట్టణానికి చెందిన సీసల రాజు 20 ఏళ్లుగా ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. పటాన్ చెరువులోని మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. ఈసారి 21వ పాదయాత్రను కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీసల రాజును, పాదయాత్ర బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. పాదయాత్ర రామచంద్రాపురం చేరుకోగానే గండమ్మ గుడి వద్ద జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ సీసల రాజు బృందాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.