బషీర్ బాగ్, వెలుగు: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ , సారిపల్లి కొండల్ రావు ఫౌండేషన్ సౌజన్యంతో.. యువ కళవాహిని, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ.. ప్రాచీన, సాంస్కృతిక కళ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కళాకారుల ఆశయాలు కలలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించిన కళాకారుల సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.