టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో జడ్డూనే అసలైన త్రీడీ ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా జడ్డూనే అన్నాడు. తన ఆల్రౌండ్ ప్రతిభతో టీమిండియాను గెలిపించడంలో అతడి పాత్ర కీలకమన్నాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో బౌలర్ల పాత్ర కీలకం అవుతుంది. ఏ ఫార్మాట్లో అయినా బౌలర్లు వికెట్లు తీస్తూ పోతే మ్యాచ్ గెలవడం సులువవుతుంది. ఇక రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే అతడో సిసలైన త్రీడీ ప్లేయర్. జడ్డూ లాంటోడ్ని పక్కన పెట్టలేం. అతడు జట్టులో ఉండాల్సిందే. క్రమం తప్పకుండా కీలక సమయాల్లో వికెట్లు తీయడం, లోయర్ ఆర్డర్లో పరుగులు రాబట్టడం, అద్భుతమైన ఫీల్డింగ్తో క్యాచ్లు పట్టడం, రనౌట్లు చేయడంలో అతడు దిట్ట. కాబట్టి ఫైనల్ మ్యాచ్లో భారత్కు అతడు చాలా విలువైన ఆయుధం కానున్నాడు’ అని కనేరియా పేర్కొన్నాడు.