
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గవాయ్తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 2025 నవంబర్ 23 వరకు సీజేఐగా జస్టిస్ గవాయ్ కొనసాగనున్నారు.
జస్టిస్ గవాయ్ 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్ సీజేఐగా బాధ్యతలను చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24న జన్మించారు. నాగ్పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు.
#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).
— ANI (@ANI) May 14, 2025
(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw
జస్టిస్ బిఆర్ గవాయ్ 1992, ఆగస్టు నుంచి 1993, జులై వరకూ బాంబే హైకోర్టు నాగుర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 2000, జనవరి 7న హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2005, నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
కీలక తీర్పులు
* రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయ్ సభ్యులు.
* ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6–1తో ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్ గవాయ్ సభ్యులుగా ఉన్నారు.
* 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1తో ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ ఉన్నారు.
* 2023, డిసెంబర్లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో ఉన్నారు.