న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10:36 గంటలకు కోర్టు హాల్లో దత్తాతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న దత్తాను సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కిందటేడాది సెప్టెంబర్లో అప్పటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ దత్తా పేరును సిఫార్సు చేసింది. జస్టిస్ దత్తా ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 28కి పెరిగింది.
సుప్రీంకోర్టులో సీజేఐతో సహా 34 మంది జడ్జిలు ఉండాలి. ప్రస్తుతం 6 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జస్టిస్ దత్తా.. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, దివంగత సలీల్ కుమార్ దత్తా కుమారుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ బావమరిది. జస్టిస్ దత్తా.. ఫిబ్రవరి 9, 1965న జన్మించారు. ఫిబ్రవరి 8, 2030 వరకు ఆయన పదవిలో ఉంటారు.