జనగామ, వెలుగు : జనగామలో తమ పార్టీకి మంచి ఆదరణ ఉందని ఇక్కడి నుంచి బరిలో నిలువాలని ఆలోచిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చెప్పారు. ఆదివారం సాయంత్రం అయన జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో సందడి చేశారు. తదుపరి సూర్యాపేట రోడ్డులో ఉన్న కెమిస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు.. కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్ను, కుల పాలన కావాలంటే రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి.. ఈ రెడ్డిలను ఎన్నుకోవాలన్నారు.
5 లక్షల కోట్లు అప్పులు తీర్చి మరో 5 లక్షల కోట్ల అభివృద్ధి చేయాలంటే ప్రజా శాంతి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. వైఎస్ షర్మిల తన పార్టీలో చేరితే పాలేరు నుంచి గెలిపిస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ నుంచి పోటీ లేదన్నారు. కేవలం 79 స్థానాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం నుంచి పోటీ ఉందన్నారు. కేసీఆర్ వద్ద ఉన్న బీసీ నాయకులు అందరూ తన పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.