
చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’లో హీరోయిన్ గురించి చాలా చర్చలు నడిచిన సంగతి తెలిసిందే. త్రిషని ఓకే చేసినా ఆమె తప్పుకోవడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దాంతో కాజల్ కానీ అనుష్క కానీ నటిస్తారనే వార్తలొచ్చాయి. చివరికి కాజలే కన్ఫర్మ్ అయ్యింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఆదివారం దేశవ్యాప్తంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉన్న కాజల్.. తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసింది. ఈ సందర్భంగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటని ఓ ఫ్యాన్ అడగగా… ‘చిరు సర్ ‘ఆచార్య’లో నటించబోతున్నా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. తిరిగి ప్రారంభమయ్యాక చిరు సర్తో కలిసి నటిస్తాను’ అని చెప్పింది. దీంతో ‘ఆచార్య’లో ఎవరు నటిస్తారనే క్లారిటీ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. వంద రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేద్దామనుకున్నారు చిరు. కానీ హీరోయిన్ మార్పు, కరోనా కారణంగా చిత్రీకరణ మరిన్ని రోజులు పట్టేటట్టు ఉంది. ఏదీ ఏమైనా చిరు, చరణ్, కొరటాల వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ‘ఖైదీ నెంబర్ 150’లో మురిపించిన ఈ జోడీ మరోసారి కనువిందు చేసేందుకు రెడీ కావడంతో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం.