- మెదక్పై ఆదిలాబాద్, హైదరాబాద్పై కరీంనగర్ గెలుపు
కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టీ20 లీగ్ ఫేజ్ -2 క్రికెట్ పోటీలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్లో శుక్రవారం నుంచి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆదిలాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మెదక్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి122 పరుగులు చేసింది. ఈ జట్టులో పి.లోహిత్ రెడ్డి 27 రన్స్, విక్రమ్ పటేల్ 24 రన్స్, నాని 22 రన్స్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆదిలాబాద్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టులో జి. సాయికృష్ణారెడ్డి 29 బాల్స్ లో 38 రన్స్, ఎ.సంతోష్ 22 బాల్స్ లో 26 రన్స్, హర్షారెడ్డి 19 బాల్స్ లో 24 రన్స్, నిఖిల్ సాయి నిక్కీ 19 బాల్స్ లో 22 రన్స్ చేశారు.
33 ఎక్స్ ట్రాలు ఇచ్చిన హైదరాబాద్ బౌలర్స్..
మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్ లో కరీంనగర్, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ జట్టులో వినీత్ పవార్ 32 రన్స్, ప్రణయ్ ఆహీర్ 27 రన్స్, జగదీశ్ యాదవ్ 24 రన్స్ చేశారు. కరీంనగర్ జట్టు బౌలర్స్ షౌమిక్ కపూర్ 4 వికెట్లు, అర్షద్ 3 వికెట్లు తీశారు. అనంతరం కరీంనగర్ జట్టు కేవలం 15 ఓవర్లలోనే 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ జట్టులో ఎర్రోజు తక్షీల్ 31 రన్స్, నితిన్ రెడ్డి, ఏ.రాజు 23 రన్స్ చొప్పున చేశారు.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్స్ 33 ఎక్స్ట్రాలు ఇవ్వడం కరీంనగర్ జట్టుకు కలిసొచ్చింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ప్రెసిడెంట్ ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, కోశాధికారి బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ పోటీలను పర్యవేక్షించారు.
ఆదిలాబాద్ జట్టు బౌలర్ ప్రణయ్ మాథ్యుస్, కరీంనగర్ బౌలర్ అర్షద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. శనివారం ఉదయం 9.30 గంటలకు నల్గొండ వర్సెస్ వరంగల్, మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం వర్సెస్ మహబూబ్ నగర్ మ్యాచ్లు జరుగుతాయి.
