కేసీఆర్ తో పాటు ఈటల, హరీష్ రావు కు ... కాళేశ్వరం కమిషన్​ నోటీసులు .. వారిని విచారించాకే సర్కారుకు పూర్తి రిపోర్ట్

కేసీఆర్  తో పాటు ఈటల, హరీష్ రావు కు ... కాళేశ్వరం కమిషన్​ నోటీసులు ..  వారిని విచారించాకే సర్కారుకు  పూర్తి రిపోర్ట్
  • కేసీఆర్​కు నోటీసులు
  • మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటలకు కూడా
  • వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కాళేశ్వరం కమిషన్​
  • జూన్​ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్​ విచారణ
  • వారిని విచారించాకే సర్కారుకు 
  • పూర్తి రిపోర్ట్​ అందజేయాలని కమిషన్​ నిర్ణయం
  • గతంలో విద్యుత్​ కమిషన్​ విచారణకు హాజరు కాని కేసీఆర్​
  • ఈ సారైనా వస్తారా? రారా? అని అనుమానాలు 
  • నోటీసుల నేపథ్యంలో కేసీఆర్​తో హరీశ్​ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ను విచారణకు పిలుస్తారా? లేదా? అన్న చర్చలకు తెరదించుతూ..  ఆయనకు కమిషన్​ నోటీసులు జారీ చేసింది.  జూన్​ 5న కేసీఆర్​ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ తోపాటు గత ప్రభుత్వం తొలి టర్మ్​లో ఇరిగేషన్​ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్​ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్​కూ సమన్లు ఇచ్చింది. ఈటలను జూన్​ 6న, హరీశ్​రావును 9న విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. కాళేశ్వరం కమిషన్​ గడువును సర్కారు 2 నెలలపాటు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన మరుసటిరోజే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్​తోపాటు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​కు కమిషన్​ నోటీసులు పంపింది.  15 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. అయితే, ఆ ముగ్గురి స్టేట్​మెంట్లు లేకుండా రిపోర్ట్​ ఇస్తే లీగల్​ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. వారిని సైతం విచారించాకే రిపోర్టు ఇవ్వాలని కమిషన్​ నిర్ణయించింది. 

కేసీఆర్​ నిర్ణయం మేరకే నడుచుకున్నామన్న ఆఫీసర్లు

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా 109 మంది అధికారులు, ప్రైవేట్​వ్యక్తులను కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారించింది. దాదాపు అధికారులందరూ నాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకున్నామని ఓపెన్​ కోర్టుల్లో చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో నాటి సీఎం తీసుకున్న నిర్ణయమే ఫైనల్​ అని తేల్చి చెప్పారు. నాటి సీఎం అధ్యక్షతన జరిగిన హైపవర్ కమిటీ మీటింగ్​లలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్​కు అధికారులు వెల్లడించారు. 2016 జనవరిలోనే ప్రాజెక్ట్​ డీపీఆర్​పై మాజీ సీఎం కేసీఆర్​ తొలి రివ్యూ మీటింగ్​ నిర్వహించారని మాజీ ఈఎన్సీలు, పలువురు ఐఏఎస్​లు కమిషన్​ ఓపెన్ కోర్టులో తెలిపారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా అదే ఏడాది మార్చిలో సీడబ్ల్యూసీకి డీపీఆర్​ సమర్పించినట్టు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్​పై 2016 మార్చి 31న అసెంబ్లీలో కేసీఆరే స్వయంగా పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ కూడా ఇచ్చారు. ప్రాజెక్టు గురించి సభ్యులకు వివరించారు. అనంతరం అదే ఏడాది మే 2న ప్రాజెక్టుకు కేసీఆర్​ భూమి పూజ చేశారు. అది జరిగిన ఐదు నెలలకే తొలి హైపవర్​ కమిటీ మీటింగ్​నిర్వహించారు. 2016 సెప్టెంబర్​ 14న,  అక్టోబర్​ 22న నిర్వహించిన రెండు హైపవర్​ కమిటీ మీటింగ్​లలో.. వ్యాప్కోస్​ డీపీఆర్​లలో మార్పులు చేయాలని కేసీఆరే సూచించారని కమిషన్​ విచారణలో అధికారులు  వెల్లడించారు.  ఆ మీటింగుల మినిట్స్​నూ కమిషన్​కు అధికారులు సమర్పించారు. 

ప్రమాదం జరిగినా నీటినిల్వపై వెనక్కితగ్గలే..

ప్రాజెక్టు అంచనా వ్యయం, నిర్మాణం తదితర అంశాలపై స్టాండింగ్​ కమిటీలోనూ చర్చించారని, ఆ తర్వాత కేబినెట్​లోనూ చర్చించి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లారని అధికారులు స్పష్టంగా కమిషన్​కు వివరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ.80,119 కోట్లుగా నిర్ణయించినా.. డీపీఆర్​లలో మార్పులకు అనుగుణంగా ప్రాజెక్ట్​ అంచనా వ్యయాన్ని రూ.1.27 లక్షల కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదీ కేసీఆరేనని స్పష్టం చేశారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాలంటూ చెప్పిందీ ఆయనేనని పేర్కొన్నారు. 2019 అక్టోబర్​ 10న మేడిగడ్డ బ్యారేజీలో తొలిసారి ప్రమాదం జరిగినప్పుడు కూడా నీటి నిల్వపై వెనక్కి తగ్గలేదని, నీళ్లు నింపాలంటూ కేసీఆరే డైరెక్షన్స్​ ఇచ్చారని అధికారులు స్టేట్​మెంట్లు ఇచ్చారు. ‘‘ఇటు ఇరిగేషన్​ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీశ్​ రావు కూడా.. ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పనులు జరుగుతున్నన్నాళ్లూ దగ్గరుండి చూసుకున్నారు. పలు విధానపరమైన నిర్ణయాలను ఆయన కూడా తీసుకున్నారు. అధికారులకు పలు అంశాల్లో ఆదేశాలిచ్చారు” అని ఓపెన్​ కోర్టుల్లో అధికారులు వెల్లడించారు. 

బ్యాంక్​ గ్యారెంటీలు, కంప్లీషన్​ సర్టిఫికెట్లు నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఇచ్చినట్టు స్పష్టంగా చెప్పారు. ఇక, ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో ఈటల రాజేందర్​ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రాజెక్టుకు ఆర్థిక అనుమతులు, బిల్లుల చెల్లింపులు, తదితర వ్యవహారాలూ ఆయన శాఖ ద్వారానే నడిచాయి. 

కేసీఆర్​తో హరీశ్​ భేటీ

కమిషన్​ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్​తో హరీశ్​ రావు భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్​కు వెళ్లిన హరీశ్​ రావు.. కేసీఆర్​తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏం చేయాలి?  విచారణకు హాజరవ్వాలా? వద్దా? లీగల్​ ఒపీనియన్​ ఏమైనా తీసుకోవాలా? లాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. కమిషన్​ ఓపెన్​ కోర్టులు నిర్వహించిన తీరు.. అధికారులు ఇచ్చిన స్టేట్​మెంట్లు.. ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపైనా ఇరువురు నేతలు డిస్కస్​ చేసినట్టు తెలిసింది.

కేసీఆర్​ వస్తారా? రారా?

అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్ట్​లో వారిపై అభియోగాలు మోపితే ఇబ్బందులు వస్తాయని కమిషన్​ భావించింది. ఈ క్రమంలోనే వారినీ విచారణకు పిలిచి వారి స్టేట్​మెంట్లనూ తీసుకుంటే బాగుంటుందని కమిషన్​ ఆలోచించింది. అందులో భాగంగానే కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​కు నోటీసులు పంపించినట్టు తెలిసింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కూడా విచారణకు హాజరయ్యేందుకు కమిషన్​ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. అయితే, విచారణకు వాళ్లు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో విద్యుత్​ జ్యుడీషియల్​ కమిషన్​ విచారణకు కేసీఆర్​ హాజరు కాలేదు. తాను విచారణకు రాలేనంటూ కమిషన్​కు లేఖ ద్వారా తెలిపారు. 

అనంతరం కమిషన్​ విచారణార్హతపై హైకోర్టులో పిటిషన్​ వేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కమిషన్​ చైర్మన్​ను మార్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్​ నోటీసుల విషయంలో కేసీఆర్​ ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. అయితే, కేసీఆర్​ విచారణకు హాజరు కాకుంటే ఏం చేయాలన్న దానిపైనా కమిషన్​ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.