అంతా కేసీఆర్ ఇష్టారాజ్యమే..కాళేశ్వరం కమిషన్ నివేదికలో సంచలన విషయాలు..

అంతా కేసీఆర్ ఇష్టారాజ్యమే..కాళేశ్వరం కమిషన్ నివేదికలో సంచలన విషయాలు..
  • బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే 
  • భారీగా ఆర్థిక అవకతవకలు..  ప్రజాధనం దుర్వినియోగం
  • కమిషన్​ నివేదికలో సంచలన విషయాలు.. నేడు కేబినెట్​లో చర్చ
  • ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్​ జోక్యం ఉంది
  • మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న ఎక్స్​పర్ట్స్​ కమిటీ నివేదికనూ తొక్కిపెట్టారు
  • బ్యారేజీల్లో నీటిని నింపాలని ఆయనే ఆదేశించారు
  • అన్నారం, సుందిళ్ల లొకేషన్లను కావాలనే మార్చారు
  • దానికి తగ్గట్టు పనుల కాంపొనెంట్లను పెంచి అంచనాలను భారీగా పెంచారు
  • ప్రాజెక్టు ఖర్చుపై డీపీఆర్​కు ముందే ప్రధానికి లేఖ రాశారు
  • ఖర్చును రూ.38,500 కోట్ల నుంచి 1.10 లక్షల కోట్లకు పెంచారు
  • కాంట్రాక్ట్​ ఏజెన్సీలకు అయాచిత లబ్ధి చేకూర్చారు
  • బ్యారేజీల వైఫల్యాలకు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ కూడా బాధ్యులే
  • అధికారుల నిర్లక్ష్యాన్నీ ప్రస్తావించిన రిపోర్ట్​


హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్​ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని 
తేల్చిచెప్పింది. కేసీఆర్​ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్​ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్​ శాఖ మంత్రి హరీశ్​రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​  కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్​ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్​ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్​ పనితీరునూ తప్పుబట్టింది. కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థలు ఎల్​ అండ్​టీ, ఆఫ్కాన్స్​, నవయుగ సంస్థలూ బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్​ తేల్చి చెప్పింది. 

కమిటీతో ఉత్తమ్​ భేటీ

జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ నేతృత్వంలోని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. అధికారుల స్థాయి నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ప్రాజెక్టు నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టలేదని, ఆర్థిక అవకతవకలు జరిగాయని నిగ్గు తేల్చింది. ఇటీవలే ఆ రిపోర్టును రాష్ట్ర సర్కార్​కు కమిషన్​ అందించిన సంగతి తెలిసిందే. దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. సోమవారం ప్రత్యేకంగా కేబినెట్​ మీటింగ్​ను ఏర్పాటు చేసి చర్చించనుంది. అందులో భాగంగానే నివేదికలోని అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఆదివారం మంత్రి ఉత్తమ్​ సమావేశమయ్యారు. రిపోర్టులోని పలు అంశాలను కమిటీ ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ అంశాల ఆధారంగా కేబినెట్​లో సర్కారు నిర్ణయం తీసుకోనుంది.  

లొకేషన్లు మార్చి.. అంచనాలు పెంచి..

బ్యారేజీల లొకేషన్లను ఉద్దేశపూర్వకంగానే మార్చారని, ఆ నిర్ణయమూ నాటి సీఎం కేసీఆర్​దేనని జ్యుడీషియల్​ కమిషన్​ నివేదిక తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 2016 జులై, ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. అయితే, వ్యాప్కోస్​తో అధ్యయనాలు చేయించకుండానే అదే ఏడాది అక్టోబర్​లో హైపవర్​ కమిటీ మీటింగ్​ను నిర్వహించారని, బ్యారేజీల సైట్​లను మార్చి నిర్మాణాలు చేపట్టాలనికేసీఆర్​, హరీశ్​ రావు  ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. దీనికి ప్రభుత్వ (కేబినెట్​) ఆమోదం కూడా లేదని స్పష్టం చేసింది. అప్పట్లో నిపుణులు ఇచ్చిన రిపోర్టులను తొక్కిపెట్టారని తీవ్రంగా ఆక్షేపించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఓ సాకును చూపించి మేడిగడ్డకు లొకేషన్​ను మార్చారని పేర్కొంది. ఆ నిర్ణయంలో ఎక్కడా నిజాయితీ లేదని తెలిపింది. ‘‘2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్​పర్ట్​ కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఫీజిబుల్​ కాదని ఆ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అక్కడ కడితే ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రభుత్వానికి సూచించింది. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని ఎక్స్​పర్ట్​ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్​ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించుకోలేదు. కోల్డ్​ స్టోరేజీకి దానిని పరిమితం చేశారు’’ అని రిపోర్ట్​ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న జీవోలు 231, 232, 233 ఇచ్చారని.. కానీ, వాటిని కేబినెట్​ ముందు పెట్టలేదని, బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్​ ఆమోదమూ లేదని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ బిజినెస్​ రూల్స్​కు విరుద్ధమని కమిషన్​ తన నివేదికలో ఆక్షేపించింది. 

డీపీఆర్​కు ముందే ప్రధానికి లేఖ

కాళేశ్వరం ప్రాజెక్ట్​కు సంబంధించి వ్యాప్కోస్​ సంస్థ డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్​)ను సమర్పించడానికి ముందే ప్రాజెక్టు ఖర్చుపై 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి నాటి సీఎం కేసీఆర్​ లేఖ రాశారని జ్యుడీషియల్​ కమిషన్​ నిగ్గు తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 71,436 కోట్లు ఖర్చవుతుందని ప్రధానికి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పొంతన లేకుండా పెంచేశారని తెలిపింది. తొలుత ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లుగా ఉండగా.. నాటి సీఎం కేసీఆర్​ లేఖ ప్రకారం 2016 నాటికి దానిని రూ.71,436 కోట్లకు పెంచారని స్పష్టం చేసింది. ఆ వ్యయం కాస్తా..  2022 మార్చి నాటికి రూ.1,10,248 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు ఇచ్చారని స్పష్టంచేసింది. 

నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే..

బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆరేనని కమిషన్​ నివేదిక తేల్చిచెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా.. నీటిని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపడంతోనే బ్యారేజీలకు పెను ప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పటి నుంచీ ఆపరేషన్స్​ అండ్​ మెయింటెనెన్స్​ (ఓ అండ్​ ఎం)ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్​ నివేదిక తేల్చింది. కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత చేయాల్సిన ఇన్​స్పెక్షన్లు చేయలేదని, నివేదికలు ఇవ్వలేదని పేర్కొంది. వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్​ స్ట్రక్చర్లుగా (తేలియాడే నిర్మాణం) డిజైన్​ చేసినప్పటికీ.. నీటిని స్టోర్​ చేసే వాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్​ స్టడీస్​, టెయిల్​ వాటర్​ రేటింగ్​ కర్వ్స్​, జీడీ కర్వ్స్​, జియోఫిజికల్​ ఇన్వెస్టిగేషన్స్​ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్​ పైల్స్​ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా.. పట్టింపులేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్​గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది. 

కుమ్మక్కయ్యారు..

ప్రాజెక్ట్​ నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారని కమిషన్​ నివేదిక తేల్చింది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. ప్రాజెక్టు కోసం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. బ్యారేజీలకు వ్యాప్కోస్​ సంస్థతో స్టడీ చేయించినా.. ఆ నివేదికనూ పక్కన పడేశారని కమిషన్​ తెలిపింది. అందుకు సంస్థకు చెల్లించిన రూ.6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్​ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్​ అండ్​ టీ పాత్ర కూడా ఉందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్​ పునరుద్ధరణను ఎల్​ అండ్​ టీ ఖర్చులతోనే చేయించాలని సిఫార్సు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​లోనే సమస్యలు వచ్చినందున.. ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది. 

కాళేశ్వరం కార్పొరేషన్​ది నేరపూరిత నిర్లక్ష్యం

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణ ఖర్చులో కాళేశ్వరం ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ది నేరపూరిత నిర్లక్ష్యమని కమిషన్​ నివేదిక వెల్లడించింది. బోర్డు మెంబర్లు దీనికి బాధ్యులని తేల్చి చెప్పింది. ఏదీ పట్టించుకోకుండానే లోన్​ ఫెసిలిటేటర్లుగా వ్యవహరించి ప్రజాధనం దుర్వినియోగానికి కారకులయ్యారని పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయాల పెంపు, రెవెన్యూ జనరేషన్​ ఆబ్లిగేషన్లను పట్టించుకోలేదని పేర్కొంది.  

‘‘2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్​పర్ట్​ కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఫీజిబుల్​ కాదని ఆ కమిటీ తిరస్కరించింది. అక్కడ కడితే ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు పెరుగుతుందని సూచించింది. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని సిఫార్సు చేసింది. కానీ, ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్​ ఉద్దేశ పూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించు కోలేదు. కోల్డ్​ స్టోరేజీకి దానిని పరిమితం చేశారు’’ అని రిపోర్ట్​ తేల్చింది.

కాంట్రాక్ట్​ ఏజెన్సీలకు అయాచిత లబ్ధి

సీడబ్ల్యూసీ సిఫార్సుల ప్రకారం కాంట్రాక్టును డిజైన్లు, నిర్మాణం, ప్లానింగ్​ సహా ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు కాంట్రాక్టర్​కే అప్పగించేలా టర్న్​కీ పద్ధతిలో ఇవ్వాల్సి ఉన్నా.. గంపగుత్తగా కాంట్రాక్టును కేటాయించారని కమిషన్​ నివేదిక స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను కావాలని మార్చేసిన నాటి సర్కారు.. దానికి తగ్గట్టుగా ప్రాజెక్టు పొడవు, ఫ్లడ్​ బ్యాంకులు, డిజైన్లనూ మార్చి వాటి ఖర్చులకూ అంచనాలను 2018 మేలో భారీగా సవరించిందని పేర్కొంది. వ్యాప్కోస్​తో చర్చించకుండానే ఆ రెండు బ్యారేజీల స్థలాలను మార్చి కాంట్రాక్ట్​కు 2016 జులై/ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది.  బ్యారేజీల స్పెసిఫికేషన్లలో మార్పులు, డిజైన్లు, డ్రాయింగ్​లు, క్వాంటిటీలు పెరిగాయన్న సాకుతో 2021–2022 మధ్య రెండోసారి అంచనాలు పెంచేశారని ఆక్షేపించింది. అందులో స్టాఫ్​ క్వార్టర్లు, గెస్ట్​ హౌస్​, స్లోప్​ ప్రొటెక్షన్​ వర్క్​లను అదనంగా చూపించారని తెలిపింది. కాంట్రాక్ట్​ ఏజెన్సీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నివేదిక తేటతెల్లం చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి 2019 సెప్టెంబర్​ 9న సబ్​స్టాన్షియల్​ కన్​స్ట్రక్షన్​ కంప్లీషన్​ సర్టిఫికెట్​, 2021 మార్చి 15న కంప్లీషన్​ సర్టిఫికెట్​ను కాంట్రాక్ట్​ ఏజెన్సీకి ఇవ్వడం అతిపెద్ద తప్పు అని కమిషన్​ నివేదిక స్పష్టంగా తేల్చిచెప్పింది. ఏజెన్సీకి అయాచిత లబ్ధి చేకూర్చేందుకే తప్పుడు ఇంటెన్షన్​తో అక్రమంగా వాటిని జారీ చేశారని పేర్కొంది. 

కమిషన్​ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..

కేసీఆర్: ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్​, నిర్మాణం, కంప్లీషన్​, ఓ అండ్​ ఎంలలో అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే మూడు బ్యారేజీలకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడింది. 

హరీశ్​ రావు: అప్పటి సీఎం కేసీఆర్​తో పాటు అప్పటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. 

ఈటల రాజేందర్​: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​పై ఉన్నా.. ఆయనలో ఆ కమిట్​మెంట్​ లోపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదు. కాళేశ్వరం కార్పొరేషన్​ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారు. 

ఎస్కే జోషి: అప్పట్లో ఇరిగేషన్​ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్​గా  ఉన్న ఈయన ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. పరిపాలనకు సంబంధించి బిజినెస్​ రూల్స్​ను ఉల్లంఘించారు. కాళేశ్వరం కార్పొరేషన్​ ఫెయిల్యూర్​కు బాధ్యుడు. 

స్మితా సబర్వాల్​: అప్పటి సీఎంవో సెక్రటరీగా స్మితా సబర్వాల్​ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. కేబినెట్​ అనుమతులకు సంబంధించి బిజినెస్​ రూల్స్​ ప్రకారం నడుచుకోలేదు. 

మురళీధర్​రావు: ఈఎన్సీగా విధుల్లో ఉన్న ఈయన సెంట్రల్​ వాటర్​ కమిషన్​కు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారు. ఓ అండ్​ఎంలో ఫెయిలయ్యారు. 

బి.హరిరాం: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్​పర్ట్స్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్​ ఎండీ అయి ఉండి కూడా బ్యారేజీల సంగతి తనకు తెలియదంటూ చెప్పారు. 
   
బ్యారేజీల నిర్మాణంలో కాళేశ్వరం సీఈ ఎన్​. వెంకటేశ్వర్లు, రామగుండం సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డి, ఈఈ ఓంకార్​ సింగ్​, ఇతర అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 

 బి. నాగేందర్​ రావు: అప్పట్లో ఈఎన్​సీ  (ఓ అండ్​ ఎం)గా ఉన్న ఈయన  2021 జనవరి 1 నుంచి బ్యారేజీల ఓ అండ్​ ఎంను పట్టించుకోవడంలో విఫలమయ్యారు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇతరులపైకి నెపాన్ని మోపే ప్రయత్నం చేశారు. మూడు బ్యారేజీలు డ్యామేజ్​ అవ్వడానికి కారణమయ్యారు. 

టి. ప్రమీల: స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​ సీఈగా ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారు. బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇన్​స్పెక్షన్​, డ్యామ్​ సేఫ్టీ డ్యూటీలు చేయడంలో విఫలమయ్యారు. డ్యామ్​ సేఫ్టీ యాక్ట్​ ప్రకారం పనిచేయలేదు. 

 నరేందర్​ రెడ్డి (సీఈ సీడీవో), కేఎస్​ఎస్​ చంద్రశేఖర్​ (ఎస్​ఈ సీడీవో), బసవరాజు (ఈఈ సీడీవో), టి. శ్రీనివాస్​ (సీఈ)లు కమిషన్​ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. నిజాలు దాచారు. వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.  

శ్రీదేవి (సీఈ ఈఆర్​ఎల్​): ప్రమాణాలకు తగ్గట్టు మోడల్​ స్టడీస్​ నిర్వహించలేదు. 

అనిల్​ కుమార్​: అప్పట్లో ఈఎన్సీగా పనిచేసిన ఈయన.. ఆదేశాలను కాదని తన సొంత నిర్ణయాలు తీసుకున్నారు.