తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్బావ సభలో రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తీసుకువచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది.. ఆ ఐదు గ్రామాలను తిరిగి తీసుకురాలేరా అని ప్రశ్నించారు.
బీజేపీకి మొదటి నుంచి తెలంగాణరాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు.. తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అన్నారు.. మెడకాయ మీద తలకాయ లేని ఓ ఎంపీ తెలంగాణను భారత్ , పాక్ విభజనతో పోల్చారు.. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదని విమర్శించారు కవిత.
తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా మాట్లాడరు.. సామాజిక న్యాయం అనే పదానికి బద్ద వ్యతిరేకి బీజేపీ అని తీవ్రంగా విమర్శించారు. మహిళ బిల్లు పక్కన పెట్టారు.. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు..పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారన్నారు కవిత.
తెలంగాణ ఏర్పాటు సందర్బంలో ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి ఏడు మండలాలను ఏపీలో కలిపారు.. అయినా బీజేపీ బానిసలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు కవిత. మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు తెలంగాణకు పట్టుకురావాలని బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు కవిత.

