భూమి తమదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ల ప్లాంటేషన్.. విషం తాగి రైతు ఆత్మహత్యాయత్నం

భూమి తమదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ల ప్లాంటేషన్.. విషం తాగి రైతు ఆత్మహత్యాయత్నం
  • పెట్రోల్​ పోసుకున్న మహిళలు
  • రైతు పరిస్థితి విషమం 
  • కామారెడ్డి జిల్లా కొండాపూర్​శివారులో ఘటన​

లింగంపేట, వెలుగు : ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్, సిబ్బంది వేధింపులు భరించలేక ఓ రైతు విషం తాగగా, ఇద్దరు మహిళలు పెట్రోల్​పోసుకుని సూసైడ్ అటెంప్ట్​చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొండాపూర్​శివారులో జరిగింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని ముంబాజీపేటకు చెందిన గుర్రపు కళవ్వకు కొండాపూర్​శివారులో సర్వే నెంబర్ 99/48లో 2ఎకరాల​20 గుంటల భూమి ఉంది. దీనికి రెవెన్యూ ఆఫీసర్లు పట్టా పాస్​బుక్​మంజూరు చేశారు. కళవ్వ తన కొడుకులు సాయిబాబా, విజయ్, సంతోష్​లతో కలిసి 50 ఏండ్లుగా ఈ భూమిలో సాగు చేసుకుంటోంది. 

ఇటీవల ఎల్లారెడ్డి ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్​ఓంకార్, డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​పృథ్వీ, బీట్​ఆఫీసర్ ఫిరోజ్​ఖాన్ వెళ్లి అది ఫారెస్ట్​భూమి అని, ప్లాంటేషన్ చేస్తామని, పంటలు వేయవద్దని హెచ్చరించారు. బాధితులు పాస్​బుక్​లు చూపించినా వినలేదు. దీంతో సర్వే కోసం చలాన్​కట్టారు. సోమవారం ల్యాండ్​సర్వే జిల్లా  ఇన్​స్పెక్టర్​అంబర్​సింగ్​ఫారెస్ట్​ఆఫీసర్ల సమక్షంలో సర్వే చే పట్టేందుకు వచ్చారు. సర్వే నంబర్​లో మొత్తంగా 381.17 ఎకరాల భూమి ఉండగా, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు 216 ఎకరాలు, రెవెన్యూ శాఖకు 165 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూములకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేవని, వారం రోజుల్లో మరోసారి వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు చూపిస్తామని చెప్పి వెళ్లిపోయారు. 

అయినా, ఫారెస్ట్​ ఆఫీసర్లు కళవ్వకు చెందిన పట్టా భూమిలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించడంతో పాటు కుటుంబసభ్యులను భూమి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన కళవ్వ కోడళ్లు భాగ్యలక్ష్మి, కావేరి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కళవ్వ రెండో కొడుకు గుర్రం విజయ్​(34) ఫారెస్ట్​ఆఫీసర్లు, గ్రామస్తుల ముందే విషం తాగాడు. అతడిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, దీనిపై ఎల్లారెడ్డి ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్ ఓంకార్​ను వివరణ కోరగా తమను భయపెట్టడానికే  విజయ్​విషం తాగాడని చెప్పారు.