బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఎమర్జెన్సీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ... ఆమె లోక్ సభ కార్యాలయాన్ని కోరినట్టు సమాచారం. అయితే ఆ విషయం ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని, అనుమతి లభించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంట్ ఆవరణలో షూటింగ్ లేదా వీడియోగ్రఫీ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉండదు. ఇది ఏదైనా అధికారిక లేదా ప్రభుత్వ పని కోసం జరిగితే అది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటారు. పార్లమెంట్ ప్రాంగణంలో చిత్రీకరణకు ప్రభుత్వ ఛానళ్లైన దూరదర్శన్, సంసద్ టీవీలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉంది. దీంతో కంగనా సినిమా షూటింగ్కు అనుమతి లభించకపోవచ్చని తెలుస్తోంది.
'ఎమర్జెన్సీ' షూటింగ్ ఈ ఏడాది జూన్లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం, నిర్మాత రచన అన్నీ కూడా కంగనా రనౌతే కావడం విశేషం.1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కంగనా... ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 'ఎమర్జెన్సీ' అనేది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం అని.. ఇది మనం అధికారాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని రనౌత్ అప్పట్లో ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే తాను ఈ కథను చెప్పదలచుకున్నాని, ఆ సమయంలో ఇందిరా చూపిన పవర్ డైనమిక్ కు తాను అట్రాక్ట్ అయ్యానని చెప్పారు. జూన్ 25 1975 నుండి మార్చి 21, 1977 వరకు దేశంలో ఇందిరా గాంధీచే ఎమర్జెన్సీ విధించారు . 21 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులపై కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయి.