
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టాదారు పాస్బుక్ కోసం రూ.2వేలు లంచం తీసుకున్న కేసులో వీఆర్వోకు కరీంనగర్ఏసీబీ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహాముత్తారం మండలానికి చెందిన లింగమల్ల వెంకట్రాజం భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో1.38 ఎకరాల స్థలం కొన్నాడు. పట్టాదారు పాస్బుక్కోసం భూపాలపల్లి మండలం తహసీల్దార్ కు 2008 జూన్ 21న దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తహసీల్దార్ విచారణ కోసం దరఖాస్తును వీఆర్వో జూపాక మొగిలికి పంపించారు. రూ.10వేలు లంచం ఇస్తేనే పాస్ బుక్ ఇప్పిస్తానని వీఆర్వో మొగిలి డిమాండ్ చేయగా, రూ.9 వేలు ఇస్తానని ఒప్పుకుని వెంకట్రాజం నవంబర్ 6న కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మరుసటిరోజు వెంకట్రాజం.. మొగిలి ఇంటికి వెళ్లి రూ.2వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జనార్దన్ తన టీమ్తో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అప్పటి సీఐ సాంబయ్య కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మికుమారి వీఆర్వో మొగిలికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.20వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. మొగిలి ప్రస్తుతం భూపాలపల్లి ఫారెస్ట్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.