
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో మానేరు రివర్ పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు ఎట్టకేలకు రిపేర్లు చేస్తున్నారు. రూ.224 కోట్లతో నిర్మించి రెండేళ్ల కింద ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి పైన వేసిన రోడ్డు కొద్ది నెలల్లోనే ధ్వంసమైంది. ఆ తర్వాత రెండు సార్లు రిపేర్లు చేసినా, మళ్లీ పై లేయర్ కొట్టుకుపోయింది. రోడ్డంతా గతుకులమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అంతేగాక ఏడాదిన్నరగా డైనమిక్ లైటింగ్ సిస్టం కూడా పని చేయకపోవడంతో బ్రిడ్జి కళ తప్పింది.
ఈ నేపథ్యంలో ఆర్అండ్ బీ ఆఫీసర్లు ఈ బ్రిడ్జిపై ఒకవైపు మరమ్మతులు ప్రారంభించారు. 500 మీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జిపై ఒక వైపు పని పూర్తి కావడానికి నెల రోజులు పట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.