టీఆర్‌‌ఎస్‌పై రవీందర్‌‌ సింగ్ ఆరోపణలన్నీ అవాస్తవాలే

టీఆర్‌‌ఎస్‌పై రవీందర్‌‌ సింగ్ ఆరోపణలన్నీ అవాస్తవాలే

టీఆర్‌‌ఎస్‌పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను ఖండించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మైనారిటీ నాయకుడికి కేసీఆర్ మేయర్ గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. జనరల్ కేటగిరీకి మేయర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్న సమయంలో వెనుకబడిన వర్గాలను ఆదరించాలని రవీందర్ సింగ్‌కు చాన్స్ ఇచ్చిన విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజీనామా చేస్తూ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సునీల్ రావు అన్నారు. ఐదేళ్లు మేయర్ పదవిలో ఉండి.. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతూ నిందలు వేయడం సమంజసం కాదన్నారు. 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గంగుల కమలాకర్ ఓటమికి ఎలాంటి కుట్రలు చేశాడో తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు సునీల్ రావు.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదన్న నిరాశతో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నిన్న టీఆర్‌‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖలో సీఎం కేసీఆర్‌‌ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని రాజీనామా లేఖలో ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ పదవులు కట్టబెట్టారని సీఎం కేసీఆర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సందర్భాల్లో ఉద్యమకారులను అవమానించి, ఉద్యమ ద్రోహులను అందలమెక్కించారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చామని రవీందర్‌‌ సింగ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి విషయాలన్నీ చెబుదామంటే కేసీఆర్ కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తూ, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘అధికారం రాకముందు మీరు ఉద్యమకారులను ఎలా గౌరవించేవారో.. అధికారం వచ్చాక వారి పరిస్థితి ఏమిటో ఓసారి గుర్తు చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇంతవరకు ఆదరించిన మీకు ధన్యవాదాలు’’ అంటూ రవీందర్ సింగ్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.