కర్ణాటకలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ధృవీకరించారు. రెండు పార్టీల మధ్య జరిగిన ఎన్నికల చర్చల్లో భాగంగా జేడీఎస్కు నాలుగు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించారని బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సెప్టెంబర్ 8న ప్రకటించిన కొద్ది రోజులకే జేడీఎస్ అధిష్టానం ఈ ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 10న బెంగళూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన దేవెగౌడ.. కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని, అందుకు నేతలు సైతం అంగీకరించారని ధృవీకరించారు. జేడీఎస్కు సీట్ల పంపకంపై కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, ప్రధాని నరేంద్ర మోదీ చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన ప్రాంతీయ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.