ప్రేమను నిరాకరించినందుకు హుబ్బళ్లిలోని కాలేజీ క్యాంపస్లో కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను ఫయాజ్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో నిందితడు ఫయాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఫయాజ్ తల్లి తన కొడుకు తరపున రాష్ట్ర ప్రజలను క్షమించాలని కోరింది. తన కొడుకు ఫయాజ్ చేసింది తప్పు అని చెప్పింది.
ఫయాజ్ తల్లి ముంతాజ్ విలేకరులతో మాట్లాడుతూ తన కొడుకు తరపున కర్ణాటక ప్రజలందరినీ క్షమించమని కోరుతున్నానని తెలిపింది. తాను అమ్మాయి తల్లిదండ్రులను క్షమించమని కోరుతున్నానని.. ఆ ఆమ్మాయి తనకు కూడా కూతురు లాంటిదని చెప్పుకొచ్చింది. కూతురు చనిపోయినందుకు వారు ఎలా బాధపడతున్నారో తనకు తెలుసంది. తాను కూడా అంతే బాధతో ఉన్నానని ముంతాజ్ చెప్పుకొచ్చారు. తన కొడుకు చేసింది ముమ్మాటికే తప్పేనని అలా.. . ఎవరెన్ని చేసినా తప్పే అని ముంతాజ తెలిపారు. తన కొడుకు చేసిన నేరానికి చట్టం ప్రకారం శిక్షించాల్సిందేనని ముంతాజ్ కన్నీటి పర్యంతమైంది.
అంతేకాకుండా నేహా తన కొడుకు ఫయాజ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని... ఈ విషయం నాకు గత ఏడాది కాలంగా తెలుసని ముంతాజ్ వెల్లడించింది. నేహా తండ్రి హిరేమత్ మాత్రం కాలేజీలో వారు స్నేహితులు మాత్రమే, ప్రేమికులు కాదని తెలిపారు. గతంలో ఫయాజ్ తన కుమార్తెకు ప్రపోజ్ చేసాడని.. కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరించిందని హిరేమత్ తెలిపారు. దీంతో పగ పెంచుకున్న ఫయాజ్ కోపంతో తన కూతురిని కత్తితో పొడిచి చంపాడన్నారు. మరోవైపు ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం ఉందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చింది.