ఎప్పుడు ఎవరికి ఎలాంటి విపత్తు జరుగుతుందో తెలియదు. అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు కొన్ని సెకన్లకే విగత జీవులుగా మారుతున్నారు. పిల్లలైనా.. పెద్దలైనా సరే.. టైం వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలకు ఎవరూ అతీతులు కారు. తాజాగా కర్నాటకలో ఓ స్కూల్లో విషాద ఘటన జరిగింది. చామరాజనగర్ జిల్లాలోని బుధవారం ( ఆగస్టు 9) ఓ స్కూల్లో 10 వతరగతి చదుదవుతున్న పెలీసా(15) అనే విద్యార్థిని ప్రార్థన చేసే సమయంలోజాతీయగీతం పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన జరిగింది.
పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో ఉదయం ప్రార్థన జరుగుతుండగా ఈ విషాద ఘటన జరిగిందని స్కూలు యాజమాన్యం తెలిపింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పెలీసా మృతి చెందిందని వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెలీసా అనాథ కావడంతో హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పాఠశాల యాజమాన్యం, స్నేహితుల నుంచి స్టేట్ మెంట్ తీసుకొని... పెలీసా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తరువాత పెలీసా మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.