- జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్లో ఆల్ పార్టీ సమావేశం
- ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, జగన్, చంద్రబాబు తదితరులు హాజరు
- ప్రగతిభవన్ కే పరిమితమైన టీఆర్ఎస్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ కీలక మీటింగ్లకు సీఎం కేసీఆర్ వరుసగా డుమ్మాలు కొడుతున్నారు. జీ- 20 సదస్సు నిర్వహణపై సోమవారం మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆల్పార్టీ మీటింగ్కు కూడా వెళ్లలేదు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ 20 కాన్ఫరెన్స్’కు మన దేశం అధ్యక్షత వహిస్తుండగా..20 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్ను ఎలా నిర్వహించాలనే దానిపై సలహాలు, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసి..40 రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పడని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా వచ్చారు. కానీ, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. సోమవారం ఉదయం నుంచి ప్రగతి భవన్లోనే ఉన్నారు. సీబీఐ నుంచి కవితకు నోటీసులు రావడంపై న్యాయ నిపుణులతో చర్చించారు. రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యులపై ఐటీ దాడులు జరగడం, కవితపై ఢిల్లీ లిక్కర్ కేసు ఉచ్చు బిగిస్తుండటంతోనే ఆల్ పార్టీ మీటింగ్కు కేసీఆర్ దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి గతేడాది నుంచి కేసీఆర్ కేంద్ర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మోడీ రాష్ట్రానికి వచ్చినా.. ఢిల్లీలో కేంద్రం ఏదైనా సమావేశం పెట్టినా వెళ్లడం లేదు. నీతి ఆయోగ్ మీటింగ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు మీడియా సమావేశంలోనే గతంలో సీఎం ప్రకటించారు.మంత్రులు కూడా ఏదైనా అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు తప్పితే..అక్కడ ముఖ్యమైన మీటింగ్లకు పోవడం లేదు. మీటింగ్కు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి, డీఎంకే చీఫ్ స్టాలిన్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీడీపీ చీఫ్ చంద్రబాబు తదితరులు తదితరులు హాజరయ్యారు.