హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఎన్నిక ప్రకటన ఏకగ్రీవమైంది.
హైదరాబాద్ లోని హైటెక్స్లో సోమవారం ఉదయం 11 గంటలకి టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు.