
- పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందనే అంచనాలు
- దయ్యాలు, కోవర్టుల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్
- కవితను పిలవకుండా.. రాయబారులతో మంతనాలు
- కేటీఆర్ను పిలిచినట్టే కవితనూ పిలిస్తే బాగుండేదంటున్న నేతలు
- తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ
- కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ రావు లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన కామెంట్లు బీఆర్ఎస్లో కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగినట్లు హైకమాండ్ అంచనాకొచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామన్న అంతర్మథనంలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి కవిత లేఖ రాయడం, ఆ లేఖ లీక్ అవడంతో మొదలైన పంచాయితీ.. ఇప్పుడు కీలక నేతలపైనే ఆరోపణలు చేసే వరకు వెళ్లింది.
అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఎయిర్పోర్టులో కవిత.. ‘‘కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నా’’యని వ్యాఖ్యానించడం, కౌంటర్గా కేటీఆర్.. ‘‘బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు’’న్నారని అనడంతో వివాదం మరో స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్నా తన తండ్రి కేసీఆర్ పిలిచి మాట్లాడకపోవడం వల్లే కవిత మనస్తాపం చెందారని, ఈ క్రమంలోనే ఆమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీలో నడుస్తున్నది.
కేటీఆర్ను పిలిచి.. కవితను పిలువలే!
ఈ నెల 23న అమెరికా నుంచి ఎయిర్పోర్టులో దిగిన వెంటనే కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ను ఫామ్హౌస్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశంపై ఇంకెవరూ మాట్లాడొద్దని సూచనలు చేశారు. ఇప్పటికే పార్టీకి డ్యామేజీ జరిగిందని, మళ్లీ లేనిపోనివి మాట్లాడితే మరింత నష్టం జరుగుతుందని కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. కొడుకు కేటీఆర్ను ఫామ్హౌస్కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్.. కూతురు కవితను మాత్రం పట్టించు కోలేదు.
కవితను కూడా పిలిపించుకొని, ఆమెను బాధించిన విషయాలేంటో కేసీఆర్ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నది. వాస్తవానికి కవిత కూడా తన తండ్రి పిలుపు కోసం ఎదురుచూశారని పలువురు నేతలు చెప్తున్నారు. తండ్రి నుంచి పిలుపు వస్తుందన్న ఉద్దేశంతోనే.. సరస్వతి పుష్కరాలకు వెళ్లాల్సి ఉన్నా కూడా టూర్ను ఆమె రద్దు చేసుకున్నారన్న ప్రచారమూ జరిగింది.
కవిత అంతగా ఎదురు చూసినా కేసీఆర్ మాత్రం పిలవకపోగా.. ఇద్దరు రాయబారులను పంపి మంతనాలు జరిపించడమూ ఆమెను మరింతగా బాధించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పిలిచి కనీసం బుజ్జగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోనన్న డిస్కషన్ గులాబీ శ్రేణుల్లో నడుస్తున్నది.
బుజ్జగింపులా.. చర్యలా..
కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న దానిపైనే పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏకంగా పార్టీ హైకమాండ్నే ప్రశ్నిస్తూ ఆమె కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసు కుంటారా.. లేదంటే పిలిపించుకుని బుజ్జగిస్తారా.. అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలూ కేడర్లో ఉత్పన్నమవుతున్నాయి.
ఇంటి గుట్టు రచ్చకు..
ఎయిర్పోర్ట్లో కవిత చేసిన ‘దయ్యాలు’ కామెంట్స్పార్టీకి కొంతవరకే డ్యామేజీ చేశాయి. కానీ, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఊహించని డ్యామేజీ జరిగిందని సీనియర్లు చెప్తున్నారు. కవిత ఎయిర్పోర్ట్లో చేసిన కామెంట్స్ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ..‘రేవంత్ కోవర్టు’ అంటూ రెచ్చగొట్టడం, కేసీఆర్ నుంచి పిలుపురాకపోవడంతో ఆమె లోలోపలే రగిలిపోయినట్లు తెలుస్తున్నది.
తాను కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నా, బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంతో కవిత.. ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని నేతలు అంటున్నారు. కవిత అమెరికా టూర్లో ఉండగా ఆమె లేఖ లీక్ అయి సంచలనం రేపితే.. ఇప్పుడు తన అన్న కేటీఆర్ అమెరికా టూర్లో ఉన్నప్పుడు ఆమె అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగాయంటూ ఇంటిగుట్టు బయటపెట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పార్టీకి మరింత డ్యామేజీ చేశాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.