
- యాంటీ మోడీ ముద్రను వదిలించుకునే ప్రయత్నం
- వ్యూహాత్మకంగా ఢిల్లీ సీఎం అడుగులు
- కొత్త స్కీమ్లు : 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, మెట్రో రైలులో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం, 400 యూనిట్లలోపు వాడితే 50 శాతం సబ్సిడీ, సిటీ అంతటా సీసీటీవీ కెమెరాలు, ఫ్రీ వైఫై
న్యూఢిల్లీ:
2019 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దాదాపు కష్టాల్లో కూరుకుపోయాయి. సొంత కార్యకర్తల్ని కాపాడుకోలేక కాంగ్రెస్ విలవిల్లాడుతోంది. ఆర్టికల్ 370, 35-ఏ రద్దుపై ఆ పార్టీ తన వాయిస్ను బలంగా వినిపించలేకపోయింది.లెఫ్ట్ పార్టీలదీ ఇదే సమస్య. మోడీతో ధీటుగా పోరాడుతానన్న తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా బీజేపీ బలం ముందు ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఒకప్పుడు మోడీని కొద్దోగొప్పో కలవరపెట్టిన కేజ్రీవాల్ మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో బేస్ ఓటునూ కోల్పోయారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ ఆప్ దారుణంగా ఓడిపోయింది. ఐదు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దిక్కులేదు.
‘సరే, మోడీ హవాలో కొట్టుకుపోయాంలే’అని అనుకోవడానికీ వీల్లేకుండా ఆప్ క్యాండేట్లకు కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లొచ్చాయి. సీఎం కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహించే ‘న్యూఢిల్లీ’ ఏరియాలో, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నీ తానై వ్యవహరించిన ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో(ఆప్ క్యాండేట్ ఆతిషి మర్లేనా) మూడో స్థానానికి పరిమితమైపోయారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్కు 33 శాతం ఓట్లు దక్కాయి. 70 స్థానాలున్న అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఏకంగా 54 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. అదే 2019 లోక్సభ ఎన్నికలకొచ్చేసరికి చీపురు పార్టీ ఓటింగ్ శాతం 18కి పడిపోగా, బీజేపీ ఓట్ల శాతం 57కు పెరిగింది. ‘‘లోక్సభ ఎన్నికలనేవి పెద్ద పార్టీలు ‘ప్రధానమంత్రి’ పదవి కోసం తలపడేవి” అంటూ ఆప్ అపజయం పెద్ద విషయమే కాదన్నట్లు కేజ్రీవాల్ ప్రకటనైతే చేశారుగానీ మిడిల్క్లాస్, ముస్లిం, దళిత వర్గాల్లో ఆప్కు ఆదరణ తగ్గిపోవడం ఆయన్ను కలవరపెడుతూనేఉంది. కోల్పోయిన ఓట్లను తిరిగి రాబట్టుకోడానికి కేజ్రీవాల్ దగ్గరున్న టైమ్ ఆరునెలలే కాబట్టి కొత్త స్ట్రాటజీని చకచకా అమల్లోకి తెస్తున్నారు.
హిందూ ఐడెంటిటీని హైలైట్ చేస్తున్నారు..
కేజ్రీవాల్ తన ‘హిందూ’గుర్తింపును బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 4న స్వామినారాయణ భగవాన్కు అభిషేకం చేస్తున్న ఫొటోలను చక్కటి కామెంట్లతో సొంత ట్విటర్ హ్యాండిల్తోపాటు పార్టీ అకౌంట్ నుంచీ ట్వీట్ చేశారు. జులై 4న ఈద్కు మాత్రం పొడిపొడిగా విషెస్ చెప్పారు. అప్పట్లో కథువా బాలికపై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కేజ్రీవాల్..పెహ్లూఖాన్ మాబ్లించింగ్ కేసులో కోర్టు తీర్పుపై కనీసం స్పందిచలేదు కూడా. ఆప్ సర్కారు ‘తీర్థయాత్రల’ పథకానికి బాగా ప్రచారం కల్పిస్తున్నారు.
జులై 20న సీఎం కేజ్రీవాల్ స్వయంగా యాత్రికుల బృందంతో కలిసివెళ్లాల్సిఉన్నా, మాజీ సీఎం షీలా దీక్షిత్ మరణంతో ఆ ప్రోగ్రామ్ వాయిదా పడింది. రక్షాబంధన్రోజునే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటన వెలువడింది. 2019 కంటే ముందు మైనార్టీలు కాంగ్రెస్ వైపునకు మళ్లారని, ఏడాది లోపు ఆ ఫ్లో మారొచ్చని, డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉండే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు కోసం కేజ్రీవాల్ పాకులాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్కూళ్లలో దేశభక్తిని కరికులమ్గా చేర్చడం, పేట్రియాటిజం పాఠాలు బోధించాలన్న ఆప్ సర్కారు తాజా నిర్ణయాలూ నేషనలిజంను అడాప్ట్ చేసుకోవడంలో భాగంగానే జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీజేపీ ప్రత్యర్థులపై ప్రయోగించే యాంటీ హిందూ లేదా యాంటీ నేషన్ ముద్ర నుంచి తనను తాను కాపాడుకోవడానికే కేజ్రీవాల్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారుతప్ప ఆప్ రాజకీయాల్లో మార్పుగా వీటిని చూడొద్దని పొలిటికల్ అనలిస్టు ఆశిష్ నందీ చెప్పారు. పార్టీ పుట్టినప్పటి నుంచే తనదైన సైద్ధాంతిక వైరుధ్యాన్ని నిలుపుకోడానికి ఆప్ చాలా కష్టపడింది. కాశ్మీర్ విషయంలో ప్రశాంత్ భూషణ్ను, రైట్వింగ్ ఐడియాలజీ విషయంలో కుమార్ విశ్వాస్ లాంటి కీలక నేతల్ని కేజ్రీవాల్ పోగొట్టుకున్నారు. ‘భారత్ మాతాకీ జై’ ఇప్పటికీ వర్ధిల్లే నినాదంగా కొనసాగుతోంది. లెఫ్ట్ పార్టీల సెక్యూలరిజం ఐడియాలజీని ఆప్ స్వీకరించలేదు. వీటి ద్వారా కేజ్రీవాల్ పార్టీకి కమిటెడ్ ఓటు బ్యాంకు ఎందుకు లేదో అర్థమవుతుంది. బీజేపీ ఒక్కటే హిందువులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ కాదని ఆయన తన ప్రచారంలో చెబుతున్నారు. కాషాయదళంతో చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కేజ్రీవాల్ హిందూ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టి, హిందూ ఓట్లను రాబట్టుకునే పనిలో ఉన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేజ్రీవాల్ పట్ల బస్తీ వాసుల్లో ఇప్పటికీ ఆదరణ ఉంది. గవర్నమెంట్ స్కూళ్లు, మొహల్లా క్లినిక్స్ మంచి సక్సెస్ సాధించాయి. ఆయన తన బేస్ ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. – జర్నలిస్ట్ నీరజ్ చౌధురి