
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కొకరికి రూ.25 కోట్ల చొప్పున ఆశ చూపి, ఏడుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని మండిపడ్డారు. ‘‘ఇటీవల బీజేపీ ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను సంప్రదించింది.
‘కొద్ది రోజుల్లో కేజ్రీవాల్ అరెస్టు అవుతారు. ఎమ్మెల్యేలను విడగొట్టొచ్చు. 21 మందితో చర్చలు జరిపాం. మరికొందరితోనూ మాట్లాడాం. తర్వాత మేం ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా రావొచ్చు. రూ.25 కోట్లు ఇస్తాం. బీజేపీ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేయొచ్చు’ అని మా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. నన్ను అరెస్టు చేసేది లిక్కర్ స్కాం కేసులో విచారించేందుకు కాదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారు.
గత 9 ఏండ్లలో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసినా వారు విజయం సాధించలేకపోయారు. మాకు ప్రజల మద్దతు, దైవం ఆశీస్సులు ఉన్నాయి. మా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నారు. బీజేపీ ఆఫర్ను తిరస్కరించారు. ఈసారి కూడా వారి కుట్రలు భగ్నమవుతాయి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఎలా పనిచేస్తుందో ప్రజలకు తెలుసని అన్నారు. బీజేపీ వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చాలా అంశాల్లో విజయం సాధించామని, అందుకే ఢిల్లీ ప్రజలు ‘ఆప్’ని అమితంగా ప్రేమిస్తారని కేజ్రీవాల్వెల్లడించారు. ఎన్నికల్లో ఆప్ని ఓడించడం వారి వల్ల కావడం లేదని, నకిలీ మద్యం కుంభకోణం సాకుతో అరెస్టు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు.