బాలీవుడ్ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2

బాలీవుడ్ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2

ముంబై: దేశంలో ఇప్పుడు సౌత్ సినిమాల హవా నడుస్తోంది. మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్ చిత్రం భాషలతో సంబంధం లేకుండా అందర్నీ ఆకట్టుకోగా.. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వంతు వచ్చింది. గురువారం విడుదలైన ఈ మూవీ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కేజీఎఫ్ మేనియాలో ఉన్నారు. దానికి హిందీ బెల్ట్లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు అద్దం పడుతున్నాయి. రిలీజ్ రోజునే రూ.53 కోట్లు వసూలు చేసి.. బాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో రోజూ అదే ఊపును కొనసాగిస్తూ రూ.46 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఉత్తరాదిన రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును కేజీఎఫ్ 2 చేరుకున్న విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. 

స్ట్రయిట్ హిందీ సినిమాలకు సాధ్యం కాని రీతిలో కేజీఎఫ్ 2 డ్రీమ్ రన్ను కొనసాగిస్తోంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి నార్త్లో ఈ సినిమా రూ.200కోట్ల మార్కుకు చేరువైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఊపును మరో రెండు వారాలు కొనసాగిస్తే బాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను ఈ మూవీ తుడిచేయడం ఖాయంలా కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2లో హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించాడు. బాలీవుడ్ సీనియర్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.