- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- ఎంపీహెచ్ డబ్ల్యూ(ఫిమేల్) పరీక్షా ఫలితాల్లో స్డేట్ ర్యాంకర్లకు అభినందనలు
ఖమ్మం టౌన్, వెలుగు : స్టేట్ ర్యాంకర్లు ఉద్యోగాలు సాధించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ (ఫిమేల్) పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు కైవసం చేసుకున్న మహిళా ప్రాంగణం విద్యార్థినులు సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ ను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన వారికి మిఠాయిలు పంచి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమవుతాయన్నారు. రాష్ట్రస్థాయిలో రెండు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పదవ ర్యాంకులు, జిల్లాస్థాయిలో మొదటి 15 ర్యాంకులు సాధించటంతో పాటు గత మూడేళ్లుగా వరుసగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినవారిని ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేతను కలెక్టర్ ప్రశంసించారు.
పేద విద్యార్థినులు, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు స్థానిక మహిళా ప్రాంగణంలో చదువుకొని రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో మహిళా ప్రాంగణం సిబ్బంది నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుదీర్, సుకన్య, మౌనిక, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ అన్లైన్ యాప్ పై పూర్తి అవగాహన ఉండాలి
ప్రజలు సైబర్ నేరాల పట్ల అలర్ట్గా ఉండాలని, సైబర్ క్రైమ్ అన్లైన్ యాప్ పై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో సైబర్ క్రైమ్ కు సంబంధించి రూపొందించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సీఐ నరేష్, ఎస్సై విజయ్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
