ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో జరిగిన సీపీఎం నేత సామినేని రామారావు మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమయ్యారు. రెండున్నర నెలల కింద జరిగిన హత్య దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో మొత్తం 24 మందికి పరీక్షలు నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ లిస్ట్లో కాంగ్రెస్, సీపీఎంకు చెందిన వారితో పాటు రామారావు కుటుంబసభ్యులు సైతం ఉన్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ 31న చింతకాని మండలం పాతర్లపాడులో సామినేని రామారావు ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఏసీపీ, సీఐలు, ఎస్సైలు సహా సుమారు 30 మంది టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేసినా సీసీ ఫుటేజీలు లేకపోవడం, గ్రామస్తులు కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పురోగతి లేదు.
ఈ నేపథ్యంలోనే 24 మందికి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని ఖమ్మం జిల్లా పోలీసులు కోర్టును కోరారు. అయితే పరీక్షలకు అనుమానిత వ్యక్తులు, సాక్షులు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే ఆరుగురు మాత్రమే లైడిటెక్టర్ పరీక్షలకు అంగీకరించినట్లు సమాచారం. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం బెంగళూరు తీసుకెళ్లినట్లు సమాచారం.
