రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది: కిషన్​రెడ్డి

 రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది:  కిషన్​రెడ్డి
  • అకౌంట్స్​లో వేసిన గంటలోపే దారిమళ్లించింది.. రాష్ట్ర సర్కార్​పై కిషన్​రెడ్డి ఫైర్
  •     లిక్కర్ స్కాంలో కేసీఆర్​ ఫ్యామిలీ మెంబర్ల పేర్లు బయటపడ్తున్నయ్

న్యూఢిల్లీ, వెలుగు: ఊర్లలో సౌలత్​లు పెంచేందుకు గ్రామ పంచాయతీల అకౌంట్​లో కేంద్రం వేసిన నిధుల్ని తెలంగాణ సర్కార్ గద్దలా తన్నుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇటీవలే తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.5,080 కోట్లు రిలీజ్​చేసిందన్నారు. అయితే ‘గద్దలా కాచుకొని ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. ఫండ్స్ వచ్చిన గంటలోపే దారి మళ్లించింది. ఇంతకు మించి దౌర్భాగ్యపు పరిస్థితి మరోటి ఉండదు’ అని మండిపడ్డారు. డిజిటల్ కీ దుర్వినియోగం చేసి సర్పంచ్​లకు తెలియకుండ, పంచాయతీ ఆమోదం లేకుండా రాష్ట్ర సర్కార్ నిధుల్ని డ్రా చేసిందని ఆరోపించారు. 

అలాగే ఉపాధి హామీ స్కీం నిధుల్ని కూడా తెలంగాణ సర్కార్ పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. గ్రామీణ పేదల ఉపాధి కోసం పెట్టిన ఈ స్కీంను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మేలు చేసేలా బీఆర్ఎస్ పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిధులు దారి మళ్లాయని సర్పంచ్ లు నిరసన తెలపాలంటే హైకోర్టు నుంచి అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. చివరకు పాదయాత్ర, ధర్నాలు, ఊరేగింపులు, మీటింగ్ కోసం న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుందంటే.. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏరకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కంటోన్మెంట్ కేంద్రం విషయంలో కమిటీ వేయడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. ఈ విషయంలో రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

నిప్పులు వస్తున్నాయో లిక్కర్ వస్తుందో....

లిక్కర్ వ్యాపారం కోసం తామేమి ఢిల్లీ రావాలని ఈ స్కాంలో బయటపడ్డ వారిని కోరలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఈ స్కాంలో దర్యాప్తు చేస్తుంటే కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వారి పేర్లు బయటపడ్డాయని తెలిపారు. తమ కండ్ల నుంచి నిప్పులు వస్తున్నాయని పేర్లు బయటపడ్డ వాళ్లు అంటున్నారని.. వారి కండ్ల నుంచి నిప్పులు వస్తున్నాయో, లిక్కర్ వస్తుందో తనకు తెలియదన్నారు. కానీ, తెలంగాణకు చెందిన వ్యక్తుల కోసం ఈ దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఈ ఇష్యూతో కేంద్రానికి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పెట్టారనే ఈడీ దర్యాప్తు పేరిట వేధిస్తున్నారంటూ.. ప్రధాని మోడీ, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ కాకపోతే.. వరల్డ్ రాజ్య సమతి(డబ్ల్యూఆర్ఎస్) పెట్టుకున్నా తమకేమి ఇబ్బంది లేదన్నారు. 

అవినీతి, నియంతృత్వం, కుటుంబ పాలన

ఉదయం లేస్తే సాయంత్రం వరకు తెలంగాణలో మాఫియా, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనే కనిపిస్తోందని కిషన్​రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తండ్రి–కొడుకులు, మామ–అల్లుండ్ల, తండ్రి– కూతుళ్ల, మజ్లిస్–బీఆర్ఎస్ పాలన సాగుతుందని ఫైర్ అయ్యారు. చేరికలపై ఎమ్మెల్యేలతో స్వామిజీలతో మాట్లాడించాల్సిన దుస్థితి బీజేపి కి లేదన్నారు. కేంద్ర మంత్రిగా తానే నేరుగా బీజేపీలో చేరాలనుకున్న వారితో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే అని చెప్పారు. అలాంటివారు కల్వకుంట్ల జాతి రత్నాలు ఎలా అయ్యారని ప్రశ్నించారు.

పెట్రోల్​ రేటు 23 రాష్ట్రాలు తగ్గించాయి

ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజలు లీటర్ పెట్రోల్ పై రూ.13 అధికంగా చెల్లిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘దేశంలో అత్యధిక వ్యాట్ తెలంగాణలో ఉంది. కేంద్రం, 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు’ అని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్​లో భాగంగా.. వంట నూనెల దిగుమతులు తగ్గించాలని, దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తిని పెంచుకోవాలని కేంద్రం పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ఇందుకోసం 2021–22, 2022–23లో రాష్ట్రానికి రూ.114 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసిందో చెప్పాని డిమాండ్ చేశారు.