
- వాళ్లింట్లో జరిగే పదవులు, ఆస్తుల పంచాయితీతో మాకేం సంబంధం?
- ఈ ఇష్యూపై బీజేపీ నేతలెవరూ మాట్లాడొద్దని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది డాడీ–డాటర్, సిస్టర్–బ్రదర్ సమస్య అని అభివర్ణించారు. వాళ్లింట్లో జరిగే పదవులు, ఆస్తుల పంచాయితీతో తమకు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. బీజేపీ నేతలెవరూ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీలో కలపాలన్నది ఎవరో, ఎవరు ఎవరితో మాట్లాడారో కవిత, కేసీఆర్నే అడగాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. ఆ కంపెనీలో వీళ్లంతా డైరెక్టర్లు.. ఆ ప్రైవేట్ కంపెనీ గురించి మేమెందుకు మట్లాడాలి? ప్రజల సమస్య అయితే తప్పకుండా మాట్లాడుతాం”అని అన్నారు. అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేసే వారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? అని ప్రశ్నించారు. అలాంటి వారి వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వలేనని అన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా..సీఎం రేవంత్రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలిపారు. గతంలో సీఎం టి.అంజయ్యను కూడా రాజీవ్గాంధీ అవమానించారని, ఇప్పడు రేవంత్రెడ్డిని రాహుల్ గాంధీ అవమానించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నా.. రేవంత్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర సీఎం అని, తెలంగాణ ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత రాహుల్గాంధీపై ఉందన్నారు.
బడేమియాకు వత్తాసుగా చొటేమియా కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దేశ సైనికులను అవమానించేలా, వారు చేసిన పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడడం సరికాదని కిషన్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్క ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి.. తెలంగాణ గడ్డపై నుంచి భారత సైనికులను అవమానించే విధంగా తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఢిల్లీలో బడేమియా రాహుల్ మాటలకు వత్తాసుగా.. హైదరాబాద్లో చోటేమియా రేవంత్ రెడ్డి కాపీ, పేస్ట్ కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘దేశ సైనికుల శౌర్య పరాక్రమాలను, ధైర్య సాహసాలను, త్యాగాలను అనుమానిస్తున్నామని, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నామనే సోయి కూడా వారికి లేకుండా పోయింది. దేశ రక్షణకు సంబంధించి, సున్నితమైన అంశాలపై ఎలా మాట్లాడాలో తెలియని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండటం దేశ ప్రజల దురదృష్టం. పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నీళ్లు చల్లే విధంగా, దేశ సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. భారత సైనికులకు అండగా.. కుల మతాలకతీతంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న విధానాన్ని దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిచాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.