న్యూఢిల్లీ: ఓవైపు ఆసియా కప్.. మరోవైపు టీ20 వరల్డ్కప్.. ఈ రెండింటికి ముందు జింబాబ్వేతో వన్డే సిరీస్. ఫామ్లోకి రావడానికి కేఎల్ రాహుల్కు ఉన్న ఏకైక సిరీస్ ఇది. ఇందులో రాణిస్తేనే ఓపెనర్గా అటు ఆసియా కప్, ఇటు మెగా టోర్నీకి బెర్త్ కన్ఫామ్ అవుతుంది. లేదంటే ఓ యంగ్స్టర్కు చాన్స్ ఇచ్చి.. రాహుల్ను బ్యాకప్గా తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో.. జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేలు రాహుల్కు కఠిన పరీక్షగా మారాయి. అయితే రాహుల్ రాకతో టీమ్లో మళ్లీ మార్పులు మొదలయ్యాయి.
గిల్కు అన్యాయమేనా?
మొదటగా రాహుల్ ప్రభావం శుభ్మన్ గిల్పై పడింది. వెస్టిండీస్తో ఆడిన మూడు మ్యాచ్ల్లో గిల్ వరుసగా 64, 43, 98 స్కోర్లతో సూపర్ ఫామ్ చూపెట్టడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. దీంతో జింబాబ్వే సిరీస్లోనూ గిల్ను ఓపెనర్గా కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆలోచన మరోలా ఉంది. ఈ సిరీస్కు ద్రవిడ్ లేకపోయినా అతను ఇచ్చిన బ్లూప్రింట్ను వీవీఎస్ లక్ష్మణ్ అమల్లో పెట్టబోతున్నాడు. అంటే గిల్ ప్లేస్లో రాహుల్ను ఓపెనర్గా దించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే రాహుల్ కోసం గిల్ను లైనప్లో కిందకు తీసుకొస్తారా? దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై భిన్న వాదనలు మొదలయ్యాయి. ‘గిల్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ సరైన దిశలోనే వెళ్తున్నది. కరీబియన్ సిరీస్లో బాగా ఆడినప్పటికీ టీమ్ వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఒక స్లాట్కు అనేక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగానే గిల్ను మూడో ప్లేస్కు సిద్ధం చేస్తున్నారు’ అని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు. గాంధీ వ్యాఖ్యలతో ఏకీభవించిన మాజీ ప్లేయర్ దీప్దాస్ గుప్తా మరో కోణాన్ని వెల్లడించాడు. ‘ఓ మంచి సిరీస్ తర్వాత గిల్ను లైనప్లో తగ్గించడం నిజంగా కష్టమే. కానీ రాహుల్ను ఆసియా కప్లో ఓపెనింగ్కు సిద్ధం చేయడమే మేనేజ్మెంట్ ముందున్న లక్ష్యం. అతను కుదురుకోవడానికి చాలా టైమ్ కావాలి. అందుకే మూడు మ్యాచ్ల్లో రాహుల్కు తగ్గినంత టైమ్ను కేటాయిస్తున్నది. గిల్ను పక్కనబెట్టడం తాత్కాలికమే అనుకుంటున్నా. గిల్ ఓపెనింగ్లో ఇలాగే ఆడితే కచ్చితంగా వన్డే వరల్డ్కప్ టీమ్లో చోటు సంపాదిస్తాడు’ అని దాస్ గుప్తా వివరించాడు.
ప్రాక్టీస్ షురూ..
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వేకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఆదివారం జరిగిన తొలి సెషన్లో రుతురాజ్, దీపక్ చహర్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ లక్ష్మణ్ ఈ సెషన్ను పర్యవేక్షించాడు. తేలికపాటి కసరత్తులు చేసిన ప్లేయర్లు తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్లో మునిగిపోయారు. సిరాజ్, చహర్, ప్రసిధ్ బౌలింగ్ను సరిచూసుకున్నారు.