రెగ్యులర్​ చేయాలంటే బెదిరిస్తరా.. ? : కోదండరామ్​

రెగ్యులర్​ చేయాలంటే బెదిరిస్తరా.. ? : కోదండరామ్​

రెగ్యులర్​ చేయాలంటే బెదిరిస్తరా?
జేపీఎస్ లది ఆత్మగౌరవ పోరాటం
టీజేఎస్​​ చీఫ్  కోదండరామ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్రటరీలది ఆత్మ గౌరవ పోరాటమని, రెగ్యులరైజ్​ చేయాలని న్యాయపోరాటం చేస్తుంటే  ప్రభుత్వం బెదిరిస్తోందని తెలంగాణ జనసమితి​  చీఫ్​ కోదండరామ్​ ఆరోపించారు.  శనివారం ఆయన సిరిసిల్లలో జేపీఎస్ లు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్​ మాట్లాడుతూ.. డ్యూటీలో చేరమని జేపీఎస్ ల కుటుంబ సభ్యులను కూడా  బెదిరించడం అన్యాయమన్నారు.

ప్రభుత్వం జేపీఎస్ లతో చర్చలు జరిపితే  సమస్య కొలిక్కి వస్తుందన్నారు. పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించిన జేపీఎస్ లకు అన్ని హక్కులుంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా రెండేండ్లు  మాత్రమే  ప్రొబెషనరీ పీరియడ్​ ఉంటుందని,  కాని జేపీఎస్ లు నాలుగేళ్లుగా డ్యూటీ చేస్తున్నా రెగ్యులర్​ చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతరాహిత్యేమని విమర్శించారు. ఇప్పటికైనా జేపీఎస్​లను రెగ్యులర్​ చేయాలని డిమాండ్​ చేశారు. వారికి  టీజేఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.