
- మరో ఆరుగురు కౌన్సిలర్లు,బీఆర్ఎస్ నేతలు కూడా
- పార్టీ కండువా కప్పిఆహ్వానించిన దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అన్నం లావణ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, మరో ఆరుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం గాంధీ భవన్ లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రుణమాఫీతో ప్రజల్లో కాంగ్రెస్ పై విశ్వాసం మరింత పెరిగిందని, అందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరిగాయన్నారు. పార్టీలో చేరిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని చెప్పి నెల ముందే మాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఇది మింగుడుపడక కాంగ్రెస్ పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రుణమాఫీ అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.