ఎయిర్ పోర్టుక ల్యాండ్ ఫైనల్ సర్వేకు సింగరేణి ఓకే

ఎయిర్ పోర్టుక ల్యాండ్ ఫైనల్  సర్వేకు సింగరేణి ఓకే

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్​పోర్టు ఏర్పాటు కు ఒక్కో  అడ్డంకిని దాటుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ఇండియా (ఏఏఐ) బృందం ఇప్పటికే  ప్రైమరీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్​లో గుట్టలు ఉండటంపై ఏఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గుట్టల ఎత్తును పక్కాగా కొలించేందుకు ప్రభుత్వం సింగరేణి సాయం తీసుకోనుంది.  సింగరేణి వద్ద ఉన్న లేటెస్ట్​ టెక్నాలజీతో గుట్టల ఎత్తు, కొలతలను తీసుకుని ఆ నివేదిక ఇవ్వాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావును కోరారు. దీంతో సర్వే నిర్వహించేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. 

సర్వే కోసం రూ. 38 లక్షలు విడుదల 

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎయిర్​పోర్టు ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడును పలుమార్లు కలిశారు. ఇక్కడ ఎయిర్​పోర్టు ఏర్పాటుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎంకు విన్నవించారు.  కొత్తగూడెంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటు సాధనకు అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రులతో పాటు ఆఫీసర్లను సీఎం రేవంత్​రెడ్డి కూడా ఆదేశించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ గవర్నమెంట్​సర్వేకు సంబంధించి రూ. 38 లక్షలు  ఇప్పటికే రిలీజ్​ చేసింది. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి కొత్తగూడెంలో ఎయిర్​పోర్టు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.  .

 కొత్తగూడెం నియోజకవర్గంలోని గరీబ్​ పేట ప్రాంతంలో ఎయిర్​పోర్టు ఏర్పాటు చేసేందుకు దాదాపు 700  నుంచి 900 ఎకరాల ల్యాండ్​ను ఆఫీసర్లు గుర్తించారు. ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా ఇటీవలి బృందం ఇక్కడకు వచ్చి   కొత్తగూడెం పట్టణంతో పాటు చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల్లో ఈ ల్యాండ్​ను పరిశీలించింది. ప్రైమరీ రిపోర్టును విమానయాన శాఖతో పాటు ఎఏఐ ఉన్నతాధికారులకు బృందం పంపించింది. ల్యాండ్​ బాగుందని చెప్పిన బృందం ఒకటి రెండు గుట్టలున్నాయని వాటితో ఇబ్బంది రావొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. 

పది రోజుల్లో సర్వే

ఎయిర్​ పోర్టు అలైన్​మెంట్​ను కొంత మార్పులు చేసేందుకు బృందంతో ఆఫీసర్లు చర్చించారు. గుట్టల ఎత్తు ఎయిర్​పోర్టు ఏర్పాటుకు అడ్డంకిగా ఉండడంపై వాటిని కొలవడంతో పాటు ఎఏఐకి అవసరమైన నివేదికలను రూపొందించడంలో కొంత జాప్యం కలుగుతోంది. ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురామిరెడ్డి కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో శనివారం డైరెక్టర్​ పా వెంకటేశ్వర్లును కలిశారు. సాయం అందించేందుకు సింగరేణి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ వారం పది రోజుల్లో సర్వే  చేసేందుకు ఒక బృందాన్ని పంపించనున్నట్టు డైరెక్టర్​ పేర్కొన్నారు. సర్వే పూర్తయితే ఎయిర్​ పోర్టు పనులు ముందుకు సాగే అవకాశాలున్నాయి. 

15  ఏళ్లుగా 

కాంగ్రెస్​ సీనియర్​ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎయిర్​పోర్టు ఏర్పాటు ప్రతిపాదనను మొదటగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ గవర్నమెంట్​లో మరోసారి ఎయిర్​పోర్టు ఏర్పాటు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని పునుకుడు చెలక, పేట చెరువు, బంగారుజాల ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు ల్యాండ్​ గురించి అధికారులు పరిశీలించారు.  ఎఏఐ బృందం వచ్చి ల్యాండ్​ను పరిశీలించింది.  అయితే ఎయిర్​ పోర్టుకు ఈ ల్యాండ్​లో  సరైన విజిబిలిటీ లేదని బృందం తేల్చి చెప్పింది. దీంతో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ఎయిర్​పోర్టు ఏర్పాటు విషయాన్ని పక్కన పెట్టింది.  దీంతో పెండింగ్ లోఉన్న ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ముందుకు కదులుతున్నాయి.