మెదక్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రైతులు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక బస్తాకు 40 కిలోలు, బస్తా బరువు 600 గ్రాములు కలిపి 40.600 కిలోలు తూకం వేయాల్సి ఉండగా, 42.500 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల క్వింటాలుకు ఐదు కిలోల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సెంటర్ నిర్వాహకులు, రైస్మిల్లర్లు మిలాఖత్ అయి రైతులకు నష్టం కలిగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుని రైతులు మోసపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తూకం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా మార్కెటింగ్ అధికారి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.