
- అదరగొడుతున్న విమెన్స్ టీమ్ యంగ్ పేసర్ క్రాంతి గౌడ్
- చెప్పుల్లేని కాళ్లతో మొదలై.. క్రికెట్ ప్రపంచంపై తనదైన ముద్ర
- పేదరికాన్ని జయించిన మధ్యప్రదేశ్ యువతి
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది వరల్డ్ కప్లో దాయాదుల పోరు అయితే ఆ ఒత్తిడిని మాటల్లో వర్ణించలేం. ఆదివారం కొలంబో స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అదే జరిగింది. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వంటి స్టార్ ప్లేయర్లు ఫెయిలయ్యారు. దాంతో ఇండియా కనీసం 250 రన్స్ కూడా చేయలేదు. ఆ టార్గెట్ను కాపాడే ప్రయత్నంలో ఇండియా పేస్ లీడర్ రేణుకా ఠాకూర్ ఒక్క వికెట్ కూడా రాబట్టలేక ఫెయిలైంది. ఈ సమయంలో నేనున్నానంటూ 22 ఏండ్ల యువ సంచలనం క్రాంతి గౌడ్ అద్భుతం చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి నిప్పులు చెరిగే బాల్స్తో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చింది. చిన్న టార్గెట్ను కాపాడే బాధ్యతను భుజాలపై వేసుకుని, అసాధారణ బౌలింగ్తో ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. ఐదు నెలల కిందటే జట్టులోకి అడుగుపెట్టిన ఈ యవ పేసర్, ఇప్పుడు టీమిండియాఅత్యంత కీలకమైన బౌలర్గా మారిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
కష్టాల ప్రయాణం..
ఇప్పుడు క్రికెట్ ఆకాశంలో యువతారలా వెలుగుతున్న క్రాంతి ప్రస్థానం వెనుక కన్నీళ్లు, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష దాగున్నాయి. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఘువారా అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో ఆరుగురిలో చివరి సంతానంగా జన్మించింది క్రాంతి. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో 8వ క్లాస్తోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పుస్తకాలు పక్కన పెట్టినా క్రికెట్పై తనకున్న పిచ్చిని ఆమె మాత్రం వదులుకోలేదు. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా, ఊరిలోని రాళ్లు తేలిన మైదానంలోనే పరుగు పెడుతూ తన బౌలింగ్కు పదును పెట్టింది. కూతురి కళ్లలో కలను, పట్టుదలను చూసిన క్రాంతి తల్లి, తన మెడలోని పుస్తెలు అమ్మి ఆమె శిక్షణకు బాటలు వేసింది. ఆ త్యాగమే క్రాంతిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
నయా పేస్ గన్
సీనియర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ గాయపడటంతో ఈ ఏడాది మేలో టీమిండియాలోకి వచ్చిన నాటి నుంచి క్రాంతి వెనుదిరిగి చూసుకోలేదు. కొలంబోలో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన తను ఇంగ్లండ్ టూర్లో అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో తన రాకను ఘనంగా చాటింది. అదే జోరును సొంతగడ్డపై ఆస్ట్రేలియాపైనా కొనసాగించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ హిట్టర్గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ప్లేయర్ అలీసా హీలీని వరుసగా మూడు మ్యాచ్ల్లో ఔట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ కప్లో పాకిస్తాన్పై ఆమె ఆట అద్వితీయం. సీనియర్ రేణుకా ఠాకూర్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా కొత్త బాల్తో క్రాంతి అద్భుతంగా బౌలింగ్ చేసింది. పాక్ టాపార్డర్ను కకావికలం చేసింది.
ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్తో వాదించి మరీ స్లిప్ ఫీల్డర్ను ఉంచమని కోరడం, ఆ తర్వాతి బాల్కే వికెట్ తీసి తన నిర్ణయం సరైనదని నిరూపించుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి, ఆటపై ఉన్న పట్టుకు నిలువుటద్దం అనొచ్చు. క్రాంతి గౌడ్ కేవలం ఒక క్రికెటర్ కాదు.. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి నిలువెత్తు నిదర్శనం. ‘నాకు అందిన సహాయాన్ని తిరిగి సమాజానికి అందించాలి. డబ్బు లేదనే కారణంతో ఏ అమ్మాయి ఆటను వదులుకోకూడదు. వారికోసం ఓ అకాడమీని నడపడమే నా లక్ష్యం’ అంటున్న క్రాంతి క్రికెట్ ప్రస్థానానికి ఇది ఆరంభం మాత్రమే. ఇదే పట్టుదలను, కసిని కొనసాగిస్తే తను మరెన్నో శిఖరాలు అధిరోహించడం ఖాయం.
రాత మార్చిన లోకల్ మ్యాచ్
ఓ లోకల్ టోర్నమెంట్లో ప్లేయర్ల కొరత కారణంగా అనుకోకుండా లభించిన అవకాశం క్రాంతి జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. బూట్లు కూడా లేని ఆ అమ్మాయిలోని అద్భుతమైన రనప్, పదునైన బౌలింగ్ యాక్షన్ కోచ్ రాజీవ్ బిల్తారేను కట్టి పడేసింది. క్రాంతిలో దాగున్న ప్రతిభ అనే నిప్పుకణాన్ని గుర్తించిన బిల్లారే.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అకాడమీలో చేర్పించాడు. అక్కడే ఆమెకు తొలిసారిగా క్రికెట్ కిట్ అందింది. రూ.1600 ఇచ్చి స్పైక్స్ కొనిచ్చినప్పుడు క్రాంతి కళ్లలో మెరిసిన ఆనందం వెలకట్టలేనిది. ఆ తర్వాత, దేశంలోని మేటి కోచ్లలో ఒకరైన చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో ఆమె ఆట మరింత పదునెక్కి, ఒక పదునైన ఆయుధంగా మారింది.