- పంట సాగు ఖర్చు, పురుగులమందులు, ఎరువుల వాడకం తగ్గించేందుకు యాప్ రూపకల్పన
- సక్సెస్ రేట్ను బట్టి రాష్ట్రమంతా అమలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కృషి వాస్యాప్ పంట సాగులో రైతులకు అండగా నిలవనుంది. జిల్లా వ్యవసాయశాఖ, కృషి వాస్సంస్థ సంయుక్తంగా యాప్ను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలాన్ని పైలెట్ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. పంటసాగుకు అయ్యే ఖర్చు, పురుగు మందులు, ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలపై ఈ యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించనున్నారు.
కృషి వాస్ యాప్తో లాభమేంటి..?
ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలతోపాటు పలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్ను రైతులు తమ మొబైల్లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పంట సమస్యలున్నా ఈ యాప్ద్వారా రైతులకు సమాచారం అందుతుంది. సాధారణంగా చీడపీడలు, వైరస్, తెగుళ్లు ఒకచోట ప్రారంభమై పంట మొత్తం విస్తరించిన తర్వాత రైతులు గుర్తిస్తారు.
దీంతో చీడపీడలు, వైరస్లు, తెగుళ్లను నివారించేందుకు రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులు, ఎరువులు వాడుతారు. కానీ ఈ యాప్ ద్వారా పంటల్లో చీడపీడలు, వైరస్లు, తెగుళ్లు ఏ ప్రాంతంలో వచ్చాయో గుర్తించే వీలుంటుంది.
పైలెట్ప్రాజెక్టుగా దమ్మపేట మండలం..
కృషి వాస్ యాప్ను అమలు చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని దమ్మపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలంలో ఆయిల్పాం, వరి, పత్తి, మొక్కజొన్న, కొబ్బరి వంటి వైవిధ్యమైన పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఈ మండలంలో దాదాపు 40 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోంది. అంతేకాకుండా ఆయిల్పామ్లో అంతర పంటలుగా జీడి మామిడి, కోకో, కొబ్బరి సాగు చేశారు.
సాగు భూమి అంతా జియో ట్యాగ్..
దమ్మపేట మండలంలో కృషి వాస్ యాప్ అమలులో భాగంగా మొదట సాగు భూమి మొత్తాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ఈ యాప్ ద్వారా పంట పరిస్థితిపై రోజువారీ అప్డేట్ ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ వస్తుంది.
రైతు పొలం వద్దకు పోకుండానే ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొక్కలో బోరాన్, మెగ్నీషియం వంటి పోషకాల లోపం గుర్తించి అవసరమైన సస్య రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఈ యాప్పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామాని ఒక కృషి మిత్ర వలంటీర్ను ఆ సంస్థ నియమిస్తుంది. ఈ వలంటీర్ పంటలను జియో ట్యాగింగ్ చేస్తారు. మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వలంటీర్లు సహకరిస్తారు. పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.
ఈ నెలలోనే అమలుకు సన్నాహాలు..
అగ్రికల్చర్మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు, కృషి వాస్ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ యాప్ను దమ్మపేట మండలంలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందికి యాప్పై అవగాహన కల్పిస్తున్నారు.
రైతు నేస్తంగా..
రైతు నేస్తంగా కృషి వాస్ యాప్నిలుస్తుంది. ఈ యాప్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా దమ్మపేట మండలంలో ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ యాప్పై రైతులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ యాప్ను రైతులు డౌన్ లోడ్చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు. – రవి కుమార్, ఏడీఏ, అశ్వారావుపేట డివిజన్
