- ఇండెంట్ తగ్గించుకోవాలని ఏపీకి కృష్ణా బోర్డు సూచన
- త్వరలోనే వైజాగ్కు బోర్డు తరలింపు: ఏపీ ఈఎన్సీ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఏపీ కోటాకు మించి నీళ్లు అడుగుతోందని, అలా ఇవ్వలేమని కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. ఎండాకాలంలో రెండు రాష్ట్రాలకు తాగునీటిని ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకోసం రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాలు మెయింటైన్ చెయ్యక తప్పదని తెలిపింది. మార్చి నెలాఖరు వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించి శుక్రవారం కృష్ణాబోర్డు ఆఫీసులో మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, నల్గొండ సీఈ నర్సింహా పాల్గొని చర్చించారు. తమకు 108 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇండెంట్ పంపగా.. 95 టీఎంసీలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని, ఆ మేరకు మళ్లీ ఇండెంట్ పంపాలని మెంబర్ సెక్రటరీ సూచించారు. దీనికి ఏపీ ఈఎన్సీ ఓకే చెప్పారు. దీంతో ఏపీ నుంచి ఇండెంట్ రాగానే రెండు రాష్ట్రాలకు వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇస్తామని మెంబర్ సెక్రటరీ తెలిపారు.
రాష్ట్రానికి 83 టీఎంసీలు
మార్చి నెలాఖరు వరకు రాష్ట్రానికి 83 టీఎంసీలు కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఇండెంట్ పంపగా.. అందుకు త్రీమెన్ కమిటీ ఓకే చెప్పింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు 40 టీఎంసీలు, ఏఎమ్మార్పీకి 18, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 4.50, మిషన్ భగీరథకు 2.50, కల్వకుర్తి లిఫ్ట్ స్కీంకు 18 టీఎంసీలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి కోటా ఎక్కువగానే ఉండటంతో.. అడిగిన మేర నీళ్లు ఇవ్వనున్నారు.
రాష్ట్ర అభ్యంతరంతోనే..
ఏపీ అడిగినన్ని నీళ్లు ఇవ్వాలంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాల(ఎండీడీఎల్) కంటే దిగువకు వెళ్లి నీటిని విడుదల చేయాల్సి ఉంటుందంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. మార్చి నెలాఖరు నాటికే ఎండీడీఎల్ దిగువకు వెళ్తే.. ఏప్రిల్, మే నెలల్లో ఇరు రాష్ట్రాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసింది. ఒకవేళ జూన్లో వర్షాలు పడకుంటే.. ఆ నెలకు తాగునీటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. దీనికి బోర్డు మెంబర్ సెక్రటరీ అంగీకారం తెలిపారు. శ్రీశైలంలో 810, నాగార్జునసాగర్లో 520 అడుగుల లెవల్ కన్నా కిందకు వెళ్లి నీటిని తరలించొద్దని ఆదేశించారు. కాగా.. ఏపీ గత వాటర్ ఇయర్లో అదనంగా తరలించుకుపోయిన 9.06 టీఎంసీలను ఈ ఏడాది వినియోగంలో లెక్కించాలని తెలంగాణ డిమాండ్ చేయగా.. ఏపీ ఈఎన్సీ వ్యతిరేకించారు. ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని మెంబర్ సెక్రటరీ సూచించారు. ఇక ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలిన రోజుల్లో ఉపయోగించుకున్న నీటిని వినియోగం కింద లెక్కించొద్దని కోరింది. దీనిపై సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మెంబర్ సెక్రటరీ తెలిపారు.
త్వరలోనే వైజాగ్కు కృష్ణా బోర్డు
వైజాగ్కు త్వరలోనే కృష్ణా బోర్డు హెడ్ క్వార్టర్స్ తరలిస్తామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. త్రీమెన్ కమిటీ మీటింగ్ ముగిసిన తర్వాత జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు ఏర్పాటుకు అవసరమైన భవనాలను కృష్ణా బోర్డు టీం పరిశీలించిందన్నారు. ఈ ఏడాది మంచి వానలు పడి రిజర్వాయర్లలో ఫుల్లు నీళ్లు ఉన్నాయని, నీటి పంపకాలకు సంబంధించి పెద్దగా వివాదాలు లేవని చెప్పారు.