తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయితీ ఎటూ తేలడం లేదు. హైదరాబాద్ లోని జలసౌదలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ఇతర విషయాలపై ఈ భేటీలో చర్చించారు అధికారులు. అయితే ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఖరారు చేయలేదు. ఎందుకంటే 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాలని ఏపీ చెబుతుండగా.. 50 శాతం వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతోంది. దీంతో వాటాల ఖరారు అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉండాలని ఖచ్చితంగా ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. 66:34 శాతం నీటి వాటాకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీంఎసీలు మాత్రమే వినియోగించుకోవాలన్నారు.
గత కొంత కాలంగా కృష్ణా నదిలో 50 శాతం వాటాపై నీటి వినియోగంపై తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆంద్రప్రదేశ్ అభ్యంతరం చెబుతోంది. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులోని పంట విస్తీర్ణానికి తగిన సరఫరా అందించాల్సిన అవసరం ఉన్నందున.. నదీ జలాల్లో 50 శాతం వాటా కోసం తెలంగాణ అధికారులు బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య 34: 66 నిష్పత్తిలో కృష్ణా నీటి కృష్ణా జలాల పంపిణీని నిర్ణయించారు. రాష్ట్ర అధికారుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా కేఆర్ఎంబీ గత తొమ్మిదేళ్లుగా అదే విధంగా పంపిణీ చేస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు 50: 50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని 22 అంశాలతో రాష్ట్ర అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.