- రాష్ట్ర సర్కారుకు బోర్డు మెంబర్ సెక్రటరీ లేఖ
- 35 టీఎంసీలకే అనుమతి ఉన్నా 39.7 టీంఎసీలు వాడారు
- బోర్డు పర్మిషన్ లేకుండా ఏకపక్షంగా తోడుకున్నారు
- పాలేరు, ఓకచెట్టివాగు, పాకాల చెరువు, కోటిపల్లివాగు డేటాను కేఆర్ఎంబీ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అడిగినట్లు క్యారీ ఓవర్ నీళ్లు ఇవ్వడం కుదరదని, తన వాటాను మించి వాడుకున్నదని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలిపింది. తెలంగాణ ఈఎన్సీ, ఏపీ ఈఎన్సీలు సభ్యులుగా ఉన్న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా తెలంగాణ డిమాండ్ లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం తెలంగాణ సర్కారుకు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే లేఖ రాశారు. నీళ్లు వాడుకోకుండా ఏపీని అడ్డుకోవాలని, తెలంగాణకు 18.7 టీఎంసీల క్యారీ ఓవర్ నీటిని వాడుకునేలా అనుమతించాలని ఇటీవల కేఆర్ఎంబీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానికి తాజాగా కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రిప్లై ఇచ్చారు.
తాగునీటి కోసం వదిలే నీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే 2018 నుంచి 2020 వరకు చాలా మీటింగుల్లో చర్చించారని గుర్తుచేశారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశాన్ని 2020 జూన్లో సీడబ్ల్యూసీకి రెఫర్ చేశారని పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం దొరకలేదు కాబట్టి కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ 2కు రిఫర్ చేశారని, ఆ వెంటనే సీడబ్ల్యూసీ రిప్లై ఇచ్చిందని చెప్పారు. ఆ లెటర్ను అదే ఏడాది రెండు రాష్ట్రాలకు పంపించామన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని, కేడబ్ల్యూడీటీ 1 నిర్ణయాలను అమలు చేయాలని డిమాండ్ చేసిందని అన్నారు. అయితే, మరోసారి జరిగిన 17వ బోర్డు మీటింగ్లో మ్యాటర్ను కేడబ్ల్యూడీటీ2కి రిఫర్ చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తుచేశారు.
తెలంగాణ వాడేసుకుంది
ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ తన వాటా నీటిని వాడేసుకున్నదని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన వాడుకోదగిన నీటి వాటా కన్నా ఎక్కువే వాడేసిందన్నారు. 2023 సెప్టెంబర్ 30 నాటికి ఉమ్మడి ప్రాజెక్టుల్లో 82.788 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఉందని, దానికి అనుగుణంగా ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు, తర్వాతి వాటర్ ఇయర్ అవసరాలకు 2.788 టీఎంసీలను కేటాయించామన్నారు. అయితే, మార్చి 10 నాటికి ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణ 39.743 టీఎంసీలను వాడుకున్నదన్నారు. కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్ లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా 4.743 టీఎంసీలను వాడేసుకున్నదన్నారు. కానీ, ఏపీ ఇప్పటిదాకా 41 టీఎంసీలే వాడుకుందని, మరో 3 టీఎంసీలు ఆ రాష్ట్రం వాడుకునేందుకు వీలుందన్నారు. అయితే, ప్రస్తుతం కృష్ణా బేసిన్లో తీవ్ర లోటు ఉన్నందున 2 రాష్ట్రాలూ ఎండాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఆ డేటా ఎందుకు అప్లోడ్ చేయలేదు?
నీటి వాడకంపై రెండు రాష్ట్రాలు సహకరించాల్సిన అవసరం ఉందని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలేరు, కోటిపల్లివాగు, ఓకచెట్టువాగు, పాకాల చెరువు ప్రాజెక్టుల వివరాలను కేఆర్ఎంబీ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ఆయన తెలిపారు. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డేటాను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.