
- రాష్ట్ర ప్రభుత్వం, టీటా సంయుక్త నిర్వహణ
- లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
మక్తల్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ టెక్నాలజీ నిపుణులందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు సింగపూర్ వేదికగా వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ జరగనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో 2023 ఏప్రిల్లో సంయుక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ (డబ్ల్యూటీఐటీసీ) లోగోను మంత్రి కేటీఆర్ ఆదివారం హైదరాబాద్లోని టీహబ్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ సదస్సులో టెక్నాలజీ ఎక్స్ఛేంజ్, ఇన్నొవేషన్స్పై ప్రధానంగా దృష్టి సారించనున్నామని తెలిపారు. టీటా దశాబ్ది వార్షికోత్సవాల్లో భాగంగా డబ్ల్యూటీఐటీసీ నిర్వహణకు ముందుకొచ్చిన టీటా చొరవను కేటీఆర్ ప్రశంసించారు. టీటా నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు.
ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ జరగనుందని చెప్పారు. అగ్రిటెక్, ఫిన్ టెక్, ఎడ్యుటెక్, హెల్త్ టెక్ వంటి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడ్తామని వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లర్నింగ్ వంటి టెక్నాలజీలు రాబోయే కాలంలో ఐటీ ఇండస్ట్రీని మలుపు తిప్పే తీరుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. డబ్ల్యూటీఐటీసీ కాన్ఫరెన్స్ నిర్వహణ విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఈ కాన్ఫరెన్స్లో తెలుగు టెకీలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.