కుంటాల పీహెచ్​సీలో పేదలకు అందని వైద్యం

కుంటాల పీహెచ్​సీలో పేదలకు అందని వైద్యం
  •     సమయపాలన పాటించని సిబ్బందిపై ఫిర్యాదు

కుంటాల, వెలుగు : కుంటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రసూతి దవాఖానాలో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వివిధ గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యం కోసం రోగులు సోమవారం ఉదయమే వచ్చి అవస్థలు పడుతూ పడిగాపులు కాస్తే.. సిబ్బంది మాత్రం తీరిగ్గా 11 గంటల వరకు పీహెచ్​సీకి వచ్చారు. రోగులు ఈ విషయాన్ని సర్పంచ్​సమత దృష్టికి తీసుకెళ్లారు.

హాస్పిటల్​కు చేరుకున్న సర్పంచ్​అక్కడి పరిస్థితిని జిల్లా వైద్యాధికారికి ఫోన్​లో వివరించారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలితో పాటు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైద్యురాలిపై గతంలో ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పనితీరులో మాత్రం మార్పు రాలేదని, కొందరు సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యురాలిపై కలెక్టర్​పై కంప్లైంట్ చేయనున్నట్లు సర్పంచ్​తెలిపారు.