ODI World Cup 2023: కోహ్లీ సెంచరీ కొడితే నాకేంటి..? అభినందించను: శ్రీలంక కెప్టెన్

ODI World Cup 2023: కోహ్లీ సెంచరీ కొడితే నాకేంటి..? అభినందించను:  శ్రీలంక కెప్టెన్

వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ సమం చేసాడు. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ వన్డేల్లో తన 49 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో మాజీలు, సహచర ప్లేయర్లు కోహ్లీని ప్రశంసిస్తూ  ప్రత్యేకంగా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ మాత్రం కోహ్లీని అభినందించడానికి తిరస్కరించాడు. 

ప్రస్తుతం వరల్డ్ కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ ముందు మెండిస్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. అక్కడ విరాట్ కోహ్లీ 49వ వన్డే సెంచరీ గురించి ఒక రిపోర్టర్ అతనికి తెలియజేసి.. మీరు కోహ్లీని అభినందించాలనుకుంటున్నారా అని అడిగాడు. అయితే మెండీస్.. కోహ్లీని నేను ఎందుకు అభినందిస్తానని అందరికీ షాక్ ఇచ్చాడు.

ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు కోహ్లీ సెంచరీని తెలుసుకొని ప్రశంసిస్తుంటే.. మెండీస్ మాత్రం నాకేం అవసరం నేనేందుకు కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేయాలని అనడంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. స్వయంగా కోహ్లీ ప్రస్తావన తీసుకొని వచ్చినా మెండీస్ ఇలాంటి సమాధానం ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి దీనికి కారణమేంటో కుశాల్ మెండిస్ కే  తెలియాలి. 

వరల్డ్ కప్ లో మెండీస్ శ్రీలంక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్ గా పర్వాలేదనిపిస్తున్నా కెప్టెన్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించిన శ్రీలంక వరల్డ్ కప్ సెమీస్ ఆశలను దాదాపుగా పోగొట్టుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక సెమీస్ కు చేరడం చాలా కష్టం.