లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్కు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతోపాటు లఖీంపూర్కు వెళ్లేందుకు ఫ్లయిట్లో బయలుదేరిన ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ రణ్ధావాలను కూడా అడ్డుకున్నారు. వారి ఫ్లయిట్ల ల్యాండింగ్కు అనుమతిని నిరాకరించారు. దీనిపై భూపేశ్ బఘేల్ సీరియస్ అయ్యారు. లఖీంపూర్ వెళ్లేందుకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. యూపీ వెళ్లేందుకు వీసా ఏమైనా కావాలా అని క్వశ్చన్ చేశారు.
లఖీంపూర్లో అసలేం జరిగిందంటే..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలను రద్దు చేయాలంటూ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. యూపీలోని లఖీంపూర్ ఖేరి జిల్లా టికోనియా, బన్బీర్ పూర్ రోడ్డుపై నల్లజెండాలతో రైతులు నిరసన తెలుపుతుండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కాన్వాయ్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన రైతులు కార్లలోని ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, ఓ డ్రైవర్ను కొట్టి చంపారు. ప్రమాదంలో 8 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధిత రైతు కుటుంబాలను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా అఖిలేష్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.