- ఎక్కువగా ఐటీ, రిలేటెడ్ సెక్టార్లలోనే ఇలాంటివి ఎక్కువ ..
- చిన్న కంపెనీలకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం వంటి సైడ్ జాబ్లతో ఎక్స్ట్రా మనీ..
- ఉద్యోగలను ఆఫీస్లకు రప్పించడంపై దృష్టి పెడుతున్న కంపెనీలు
బిజినెస్డెస్క్, వెలుగు: వర్క్ ప్రమ్ హోమ్తో కంపెనీలకు కొత్త ఇబ్బందులొస్తున్నాయి. ఉద్యోగులను సూపర్వైజ్ చేసేవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొంత మంది సైడ్ జాబ్లను చూసుకుంటున్నారు. జాబ్ అవర్స్లో కూడా సైడ్ జాబ్స్ చేసుకోవడం కంపెనీలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ, రిలేటెడ్ సెక్టార్ల ఉద్యోగులు ఇతర ప్రాజెక్ట్లను, అసైన్మెంట్లను చూసుకుంటున్నారు. ఇలాంటి వారిపై కంపెనీలు కోపంగా ఉన్నాయి. ఉద్యోగులు సైడ్ జాబ్స్ కూడా చేస్తున్నారని, కొంత మంది అయితే జాబ్ అవర్స్లో సైడ్ వర్క్ చేస్తున్నారని చెబుతున్నాయి. తాజాగా ఓ పెద్ద ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన ల్యాబ్టాప్లలో ఎంప్లాయ్ ప్రొడక్టివిటీని ట్రాక్ చేసేందుకు ఓ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసింది. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తప్పుగా వాడుతున్నారని కనిపెట్టింది. ఉద్యోగులు రోజుకి 9–10 గంటలు పాటు పనిచేస్తున్నా, అవుట్ పుట్ పెరగకపోవడాన్ని గుర్తించింది. వర్క్కు సంబంధం లేని ఇతర వర్క్లను ఉద్యోగులు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించింది.
చిన్న కంపెనీలకు సాఫ్ట్వేర్ డెవలపర్లుగా..
పెద్ద కంపెనీల్లో చేసే వైట్ కాలర్ (ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు) జాబ్ హోల్డర్లు ఇలా సైడ్ జాబ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, రిలేటెడ్ సెక్టార్లోని కంపెనీల ఉద్యోగులు, స్టార్టప్లు, చిన్న కంపెనీలకు యాప్లను, సాఫ్ట్వేర్లను డెవలప్ చేస్తున్నారు. కొంత మంది ఫ్రీలాన్స్ వెబ్సైట్లలో రిజిస్టర్ అయ్యి ఎక్స్ట్రాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా ఉద్యోగులు చేస్తే కంపెనీలు వెంటనే క్రమశిక్షణా చర్యలను తీసుకుంటాయని లా కంపెనీ ట్రై లీగల్ పార్టనర్ అతుల్ గుప్తా అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ను అడ్వాంటేజ్గా తీసుకుంటున్న కొంత మంది వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారని అన్నారు. తమ క్లయింట్ కంపెనీ ఒకటి ఈ పరిస్థితులను ఎదుర్కొందని చెప్పారు. ఇలాంటి సంఘటనలను గుర్తించడంతో కంపెనీలు ఎలర్ట్ అవుతున్నాయి. ఆఫీస్ ల్యాప్టాప్లలో మానిటరింగ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలని చాలా కంపెనీలు చూస్తున్నాయని గుప్తా పేర్కొన్నారు.
చిన్న కంపెనీలకు పండగ..
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చిన్న కంపెనీలు, స్టార్టప్లు బాగా వాడుకుంటున్నాయి. ఇతర కంపెనీల్లో ఫుల్ టైమ్గా చేస్తున్న ప్రొఫెషనల్స్తో తమ పనిని పూర్తి చేసుకుంటున్నాయి. దీంతో ఈ కంపెనీలకు ఖర్చు భారీగా తగ్గుతోంది. కొంత మంది ఉద్యోగులు, ముఖ్యంగా జూనియర్ లెవెల్స్లో పనిచేస్తున్న వారు తమ సాయంత్రం టైమ్ను, వీకెండ్స్ను, కొన్నిసార్లు వర్క్ అవర్స్ను కూడా పార్ట్టైం జాబ్స్కు వాడుకుంటున్నారు. ఈ టైమ్లలో ఇతర ప్రాజెక్టులను, అసైన్మెంట్లను కంప్లీట్ చేసుకుంటున్నారు. ‘చిన్న యాప్లను డెవలప్ చేయడానికి నెలకు 20–25 గంటలపాటు నా కోసం కొందరు పనిచేస్తున్నారు. దీంతో పెద్ద కంపెనీలకు కమీషన్ ఇవ్వడం లేదా ఫుల్ టైమ్ ఎంప్లాయిస్ను నియమించుకోవడం తప్పుతోంది. డబ్బులు మిగులుతున్నాయి. వీరు కూడా రూ. 20–25 వేలు ఎక్స్ట్రాగా సంపాదించుకోవడానికి వీలుంటోంది’ అని పెద్ద కంపెనీల ఉద్యోగులతో పార్ట్టైం జాబ్స్ చేయించుకుంటున్న ఓ కంపెనీ హెడ్ పేర్కొన్నారు.
హైబ్రిడ్ వర్క్ విధానం ఫ్యూచర్ కాదేమో!
తమను మోసం చేస్తున్నారనే విషయాన్ని కంపెనీలు గుర్తిస్తున్నాయని ఈవై గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇండియా లీడర్ అర్పిందర్ సింగ్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తున్నారో లేదో? గుర్తించి, సొల్యూషన్ కనిపెట్టాలని కనీసం ఆరు కంపెనీలు తమ వద్దకు వచ్చాయని అన్నారు. ‘చాలా వరకు ఇలాంటి సంఘటనలు టెక్ సెక్టార్లో కనిపిస్తున్నాయి. ప్రొఫెషనల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వాడుకొని ఇతరుల కోసం యాప్స్ను డెవలప్ చేయడం, ఐటీ పరంగా సాయం చేయడం వంటివి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్లో తమ ఉద్యోగులు డబుల్ జాబ్స్ చేస్తున్నారనే విషయాన్ని కొన్ని ఐటీ కంపెనీలు తమకు వెల్లడించాయని సెక్యూఆర్ క్రెడిన్షియల్స్ సీఈఓ రాహుల్ బెల్వాకర్ అన్నారు. ‘చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై తమ వెర్షన్ను మార్చడం గమనించొచ్చు. హైబ్రిడ్ విధానంపై ఇప్పుడు ఇవి మాట్లాడటం లేదు. ఫిజికల్గా ఆఫీస్కు రావడమే ఫ్యూచర్ అని చెబుతున్నాయి. ఈ డిసెంబర్ లేదా జనవరి నాటికి తమ ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉద్యోగులు డబుల్ జాబ్స్ చేయడమే’ అని పేర్కొన్నారు. మరికొంత మంది ఉద్యోగులు కంపెనీల పర్మిషన్ తీసుకొని ఇతర ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్స్ ఒప్పుకుంటున్నారని ఫ్లెక్సింగ్ ఫౌండర్ చంద్రిక పస్రీచా అన్నారు. ‘హాస్పిటాలిటీ, ట్రావెల్ వంటి కొన్ని సెక్టార్లలోని కంపెనీలు ఇలాంటివాటికి ఓకే ఉంటున్నాయి. తమ ఉద్యోగులను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతుండటమే ఇందుకు కారణం. తమ బిజినెస్కు ఎటువంటి అడ్డంకి లేనప్పుడు ఇతర ప్రాజెక్టులను తీసుకోవడానికి ఉద్యోగులకు అనుమతిస్తున్నాయి’ అని ఆమె అన్నారు.