న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్2023 క్వార్టర్లో 36 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 3,116 కోట్లకు చేరింది. ఈ ఏడాది క్యూ 1 లో ఆదాయం కూడా 49,028 కోట్లకు ఎగసింది. అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్లో రెవెన్యూ రూ. 36,548 కోట్లు మాత్రమే. రూ. 10 వేల కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రపోజల్కు డైరెక్టర్ల బోర్డు ఓకే చెప్పింది. ఈ ప్రపోజల్కు షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక్కో షేర్కు రూ. 6 చొప్పున స్పెషల్ డివిడెండ్ చెల్లింపును కూడా డైరెక్టర్ల బోర్డు రికమెండ్ చేసింది. కంపెనీ చేతిలోని మిగులు డబ్బును షేర్హోల్డర్లకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని, అంతకు ముందు పెట్టుకున్న స్ట్రాటజిక్ ప్లాన్లో ఇదొక ముఖ్యమైన అంశమని సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణియన్ చెప్పారు. ఇండియాలో క్యాపెక్స్ బూమ్ఎదుగుదలకు సాయపడుతోందని, అదే విధంగా గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ ప్రాజెక్టులు కూడా కంపెనీకి మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సర్వీసెస్ బిజినెస్ బాగా నడుస్తోందని అన్నారు.
కొత్త ఆర్డర్లు
పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలలో ఎల్ అండ్ టీ కంపెనీకి కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఇండియాలో స్కాడా, డీఎంఎస్, సంబంధిత ఐటీ ఇన్ఫ్రా ప్రాజెక్టు గుజరాత్లో దొరికిందని, జార్ఖండ్లో 400 కేవీ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు ఆర్డరు కూడా వచ్చిందని ఎల్ అండ్ టీ వెల్లడించింది. ఇక మిడిల్ ఈస్ట్లో హై ఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లోనూ ఒక ఆర్డరు లభించినట్లు పేర్కొంది.