
హైదరాబాద్: దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీరియస్ అయ్యారు BJP రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారన్నారు. సబ్ ప్లాన్ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి, అటకెక్కించారని తెలిపారు.
గురువారం లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ దగ్గర BJP ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి మూడున్నరేళ్లయినా ఎందుకు నిర్మించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు లక్ష్మణ్.