
- రైతుల కోసం నేతల పొలంబాట
- పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న పొన్నాల, కొమ్మూరి డిమాండ్
- ఆదుకుంటామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
చేర్యాల, కొమురవెల్లి, వెలుగు: వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల కోసం ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డితో పాటు సీపీఎం, సీపీఐ నేతలు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో పొలంబాట పట్టారు. చేర్యాల మండలంలోని చుంచనకోట, పోతిరెడ్డిపల్లి, కడవేర్గు, పెద్దరాజుపేట, నాగపురి, శబాష్ గూడెం, కొమురవెల్లి మండలం అయినాపూర్, పోసానపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరి, మామిడి పంటలను పరిశీలించి.. బాధిత రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదిన్నరేండ్లలో ఒక్కసారి కూడా పంటనష్ట పరిహారం ఇవ్వలేదని, రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులో అప్పు పెరిగిపోయిందని వాపోయారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు కౌలు రైతులతో సహా ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ వడగళ్లతో దెబ్బతిన్న వరి, మామిడి పంటల రైతులను ప్రుభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కేంద్రం కూడా విపత్తు శాఖ నుంచి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు ఉల్లంపల్లి కర్ణాకర్, తలారి కీర్తన, జడ్పీటీసీలు సిద్దప్ప, గిరికొండల్ రెడ్డి, ఆయా పార్టీల నేతలు ఆది శ్రీనివాస్, ఎండీ ఎగ్బాల్, కొమ్ము నర్సింగరావు, కాటం మల్లేశం, రాజేందర్ రెడ్డి, వకుళభరణం నర్సయ్య, అంజిరెడ్డి, అయిలయ్య, శ్రీనివాస్, కనుకరాజు తదితరులు పాల్గొన్నారు.